న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మార్చి-మేలో భారత ఆర్ధిక వ్యవస్ధ రికవరీకి విఘాతం కలగడంతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి వృద్ధి రేటులో మూడు శాతం కోత విధించిన ఐఎంఎఫ్ వృద్ది అంచనాను 9.5 శాతానికి పరిమితం చేసింది. కొవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రత దృష్ట్యా వృద్ధి రేటు అంచనాను డౌన్గ్రేడ్ చేసినట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది. అంతకుముందు 2022 ఆర్ధిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 12.5 శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.
మార్చి-మేలో మహమ్మారి తీవ్రత కారణంగా రికవరీ ప్రక్రియ మందగించిందని పేర్కొంది. సెకండ్ వేవ్లో కరోనా వైరస్ వ్యాప్తితో ఆరోగ్య మౌలిక వ్యవస్ధపై ఒత్తిడి పెరగడంతో ప్రాణాధార మందుల లభ్యత అడుగంటడం, ఆక్సిజన్ సరఫరాలు, బెడ్ల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక 2021-22 ఆర్ధిక సంవత్సరంలో అంతర్జాతీయ వృద్ధి రేటు ఆరు శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ తన అంచనాలను కొనసాగించింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆశించిన దానికంటే మందకొడిగా సాగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.