సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6 (నమ స్తే తెలంగాణ): ఇప్పటికే అనేక ఆవిష్కరణలకు నెలవైన ఐఐటీ హైదరాబాద్.. మరో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. విద్యా, పరిశ్రమల పరస్పర సహకారాన్ని విస్తరించేందుకు జపాన్కు చెందిన కంపెనీ బియాండ్ నెక్స్ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (బీఎన్వీఐ)తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నది. ఈ సందర్భంగా ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ.. ఐఐటీహెచ్, బీఎన్వీఐల మధ్య ఈ అవగాహన ఒప్పందం ఇండో-జపాన్ సహకారం తదుపరి దశలోకి ప్రవేశించిందనడానికి రుజువన్నారు. స్టార్టప్లు, వాటి పర్యావరణ వ్యవస్థలు అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. కాగా, ప్రయోగశాలలో ప్రారంభ-దశ సాంకేతికతల నుంచి సామాజికతల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఓపెన్ ఇన్నోవేషన్ గురించి బీఎన్వీఐ తత్వశాస్ర్తానికి తాను గట్టిగా మద్దతు ఇస్తున్నట్టు మూర్తి ప్రకటించారు. కార్యక్రమంలో ఐఐటీహెచ్ ఫ్యాకల్టీ అసోసియేట్ డాక్టర్ కొటారో కటవొక, బీఎన్వీఐ బిజినెస్ హెడ్ షా మయూర్ తదితరులు పాల్గొన్నారు.