IIT-Bombay Placements | ఐఐటీలు, ఐఐఎంలు మొదలు ప్రముఖ విద్యా సంస్థల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులను క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా కార్పొరేట్ సంస్థలు నియమించుకుంటాయి. ఐఐటీ-బాంబేలో ఇటీవలే నిర్వహించిన ప్లేస్ మెంట్స్ డ్రైవ్లో రికార్డులు నమోదయ్యాయి. ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థికి అంతర్జాతీయ సంస్థ గరిష్టంగా రూ.3.7 కోట్ల వార్షిక వేతన ప్యాకేజీ ఆఫర్ చేయగా, దేశీయ సంస్థ రూ.1.7 కోట్ల వేతన ప్యాకేజీ లభించింది.
గతేడాది అంతర్జాతీయ సంస్థ గరిష్టంగా రూ.2.1 కోట్ల వేతన ప్యాకేజీ ఆఫర్ చేస్తే, జాతీయ సంస్థ రూ.1.8 కోట్లు ఆఫర్ చేసింది. అంతర్జాతీయ వేతన ప్యాకేజీ గణనీయంగా పెరిగితే, దేశీయ ప్యాకేజీ స్వల్పంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే సగటు వేతన ప్యాకేజీతో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సెక్టార్ సంస్థలు అత్యధికులను నియమించుకున్నాయి. ఐటీ, సాఫ్ట్ వేర్ నియామకాలు తగ్గుముఖం పట్టాయి.
2020-21, 2021-22లతో పోలిస్తే 2022-23 నియామకాల్లో స్వల్పంగా ఎక్కువ వేతన ప్యాకేజీలతో నియామకాలు జరిగాయి. 2020-21లో సగటున రూ.17.9 లక్షలు, 2021-22లో రూ.21.5 లక్షల ప్యాకేజీ లభిస్తే, ఈ దఫా రూ.21.8 లక్షల వేతన ప్యాకేజీని ఆఫర్ చేశాయి సంస్థలు. 97 ఇంజినీరింగ్ కంపెనీలు ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల కోసం 458 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.
ఈ ఏడాది 16 మంది గ్రాడ్యుయేట్లకు రూ.కోటికి పైగా వేతన ప్యాకేజీతో ఆఫర్లు లభిస్తాయి. మొత్తం 300 మంది విద్యార్థులకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు అందాయి. 65 ఇంటర్నేషనల్ ఆఫర్లతో కలిపి మొత్తం 194 మంది విద్యార్థులు ఆఫర్లను ఆమోదించారు. గతేడాదితో పోలిస్తే ఇంటర్నేషనల్ ఆఫర్లు తక్కువగా వచ్చాయి.
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో గతేడాది మాదిరిగానే నియామకాల్లో స్తబ్దత నెలకొంది. అయినప్పటికీ అమెరికా, జపాన్, బ్రిటన్, నెదర్లాండ్స్, హాంకాంగ్, తైవాన్ దేశాల్లోని సంస్థలు విద్యార్థులకు ఆఫర్లు అందించాయి.
బీటెక్, డ్యుయల్ డిగ్రీ, ఎంటెక్ విద్యార్థుల్లో ప్లేస్మెంట్ డ్రైవ్లో పాల్గొన్నవారిలో దాదాపు 90 శాతం మంది ఉద్యోగాలు పొందారు. 2022-23లో ఓవరాల్గా 1845 మంది విద్యార్థులకు 1516 మంది (82 శాతం)కి ఉద్యోగాలు లభించాయి. పీహెచ్డీ విద్యార్థుల్లో 31 శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందారు. ఐఐటీల్లో రెండు దశల్లో ప్లేస్మెంట్స్ జరుగుతాయి. డిసెంబర్/ జనవరి, జూన్, జూలై నెలల్లో ప్లేస్ మెంట్స్ డ్రైవ్ నిర్వహిస్తారు.