న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పన్ను చెల్లింపుదార్లు వారి ఆదాయపన్ను రిటర్న్లు (ఐటీఆర్లు) సమర్పించే గడువుతేదీ దగ్గరపడుతున్నది. ఎటువంటి ఆలస్య రుసుము, పెనాల్టీలు పడకుండా ఐటీఆర్ దాఖలుకు డిసెంబర్ 31 గడువుతేదీగా ఐటీ శాఖ ప్రకటించింది. చివరి నిమిషం వరకూ వేచిచూడకుండా వెనువెంటనే రిటర్న్ దాఖలు చేయాలంటూ టాక్స్పేయర్లను ఆదాయపన్ను శాఖ పదే పదే కోరుతున్నది. ఈ నెల 26నాటికి 4.51 కోట్ల మంది రిటర్న్లు వేశారని సోమవారం శాఖ ప్రకటించింది. గతేడాది గడువుతేదీనాటికి దాఖలైన ఐటీ రిటర్నులతో పోలిస్తే, ఈ ఏడాది మరో 1.5 కోట్ల మంది రిటర్న్లు సమర్పించాల్సి ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో…2021-22 అసెస్మెంట్ సంవత్సరానికి ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు డిసెంబర్ 31 గడువుతేదీలోపు రిటర్న్లు వేయకపోతే జరిగే పరిణామాల్ని నిపుణులు ఇలా వివరిస్తున్నారు…
చాలా మంది ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీయే చివరి తేదీ అని భావిస్తారు. ఇందుకు గడువు తేదీ డిసెంబర్ 31కాగా, చివరితేదీ 2022 మార్చి 31.
గడువు తేదీలోగా రిటర్న్ వేయకపోతే..ప్రస్తుత ఏడాది వ్యాపార, ఆస్తి విక్రయ ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన నష్టాల్ని ఈ ఏడాది ఆదాయం నుంచి తగ్గించుకోలేరు. వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే హక్కు కోల్పోతారు.
అసెస్మెంట్ సంవత్సరంలో అధికంగా చెల్లించిన పన్నులకు సంబంధించి రిఫండ్లపై వడ్డీ లభించదు.
అలాగే రూ. 5 లక్ష లకు మించిన పన్ను ఆదాయం గలవారు..గడువు తేదీ తర్వాత రిటర్న్ వేసే సమయంలో రూ.5,000 ఆలస్య రుసుం చెల్లించాలి. రూ.5 లక్షల లోపు పన్ను ఆదాయం ఉన్నవారికి ఈ రుసుం రూ.1000. స్థూల ఆదాయం నుంచి లభించే మినహాయింపుల కారణంగా మీరు అస్సలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా, రూ.1,000 కట్టాల్సిందే.
చివరి తేదీ అయిన మార్చి 31నాటికి కూడా రిటర్న్ వేయకపోతే, ఎగవేసిన పన్ను మొత్తంలో కనిష్ఠంగా 50 శాతం వరకూ పెనాల్టీ విధిస్తారు. ఈ తేదీనాటికి పన్ను, వడ్డీ కలిపి చెల్లించాల్సిన మొత్తానికి ఐటీ శాఖ నోటీసులు జారీచేస్తుంది.
అలాగే ఐటీఆర్ దాఖలు చేయనివారిని ప్రాసిక్యూట్ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉంది. ప్రస్తుత చట్టాల ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. రూ.10,000కు మించి పన్ను ఎగవేసినవారిపై ఇటువంటి ప్రాసిక్యూషన్ చర్యల్ని ఐటీ శాఖ చేపడుతుంది.