Repo Rate | గ్లోబల్ మార్కెట్లో విజృంభిస్తున్న ముడి చమురు ధరలు.. భారతీయ రుణగ్రహీతల ఈఎంఐలకు సెగ పెట్టనున్నాయా?ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానాన్నే ఇస్తున్నాయి. పెరుగుతూపోతున్న క్రూడ్ ఆయిల్ రేట్లు.. ఆర్బీఐ రెపోరేటును పరుగులు పెట్టించనున్నాయనే అంచనాలు మొదలయ్యాయి మరి. ఇదే జరిగితే బ్యాంకు రుణాలు ప్రియమే. జేబుల్లోంచి మరింత సొమ్ము అప్పులను తీర్చేందుకు వెళ్లాల్సిందే.
న్యూఢిల్లీ, నవంబర్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ వృద్ధిరేటు బలోపేతానికి భారీగా తగ్గించిన రెపోరేటును.. ఆ తర్వాత ద్రవ్యోల్బణం అదుపు పేరుతో రికార్డు స్థాయికి పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుడు మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు రెపోరేటు 250 బేసిస్ పాయింట్లు ఎగబాకింది. అయితే అప్పట్నుంచి వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్యసమీక్షల్ని చేస్తూ వస్తున్న ఆర్బీఐని.. ఇప్పుడు విజృంభిస్తున్న ముడి చమురు ధరలు తిరిగి వడ్డింపుల దిశగా నడిపించేలా ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ఒకటి ఇదే అంటున్నది మరి. నిజానికి వచ్చే ఏడాది ఏప్రిల్-జూన్ నుంచి ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గుతాయని ఇంతకుముందు మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు వీటిని తలకిందులు చేస్తున్నాయి.
మున్ముందు ఇబ్బందులేనా?
గ్లోబల్ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్ల ఎగువకు చేరితే.. భారత్కు ఇబ్బందులు మొదలవుతాయని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేస్తున్నది. దేశ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) విస్తరిస్తుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుందని పేర్కొంటున్నది. ఇవే జరిగితే రిజర్వ్ బ్యాంక్ మళ్లీ వడ్డీరేట్ల పెంపునకు దిగుతుందని స్పష్టం చేస్తున్నది. ఇప్పటికే ద్రవ్యోల్బణం ఠారెత్తిస్తున్న సంగతి విదితమే. మార్కెట్లో కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, చేపలు, పప్పు దినుసులు, ఇతరత్రా కిరణా సరకుల రేట్లు పరుగులు పెడుతున్నాయి.
ఈఎంఐలు భారం
ప్రస్తుతం రెపోరేటు 6.5 శాతం వద్ద ఉన్నది. ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచితే ఇది మరింత పెరుగుతుంది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత తదితర బ్యాంకింగ్ రుణాలు భారంగా మారుతాయి. అయితే కొత్త రుణగ్రహీతల సంగతి పక్కనబెడితే, ఇప్పటికే అప్పులు తీసుకున్నవారి పరిస్థితి మాత్రం ఇబ్బందికరమేనని చెప్పాలి. నిజానికి ఇప్పుడున్న రుణాల్లో చాలావరకు కరోనా టైంలో వడ్డీరేట్లు తగ్గడాన్ని చూసి తీసుకున్నవే. వీటిపై వడ్డీరేట్లు 2.5 శాతానికిపైగా ఇప్పటికే పెరిగాయి. ఈఎంఐలు కట్టలేక ఎంతోమంది రుణాల పునర్వ్యవస్థీకరణకు, వడ్డీరేట్ల సవరణలకూ దిగుతున్నారు. ఈ సమయంలో మళ్లీ వడ్డీరేట్ల పెంపు అంటే అంతా సంక్షోభంలో పడ్డట్టేనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది అటు బ్యాంకింగ్ వ్యవస్థకు, ఇటు దేశ జీడీపీకి కూడా శ్రేయస్కరం కాదంటున్నారు.
ఎన్నికల తర్వాత పెట్రో మంటలే..
ఆయా రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యానే దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఇక వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో మరో 6-7 నెలలపాటు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పూ ఉండదనే చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎంత పెరిగినా ఇక్కడ మాత్రం ఇంతే. కానీ ఎన్నికలు ముగిస్తే ధరలు ఒక్కసారిగా పెరుగుతూపోతాయని, లీటర్ పెట్రోల్, డీజిల్తోపాటు వంటగ్యాస్ ధరలూ రికార్డు స్థాయికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని రకాల వస్తూత్పత్తుల ధరలు కొండెక్కుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణం పైపైకి వెళ్తుందని, అందుకు తగ్గట్టే ఆర్బీఐ వడ్డీరేట్ల బాదుడు, బ్యాంకు రుణాలు ప్రియం కావడం జరుగుతుందని అంటున్నారు.
అధిక చమురు ధరలు స్థిరంగా ఉంటే భారత్ జీడీపీలో కరెంట్ ఖాతా లోటు 2.5 శాతాన్ని దాటిపోతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. బ్యారెల్ చమురు ధర 10 డాలర్లు పెరుగుతూపోయినకొద్దీ ద్రవ్యోల్బణం 50 బేసిస్ పాయింట్ల చొప్పున ఎగిసిపడుతుంది. ఈ క్రమంలో కరెంట్ ఖాతా లోటు కూడా 30 బేసిస్ పాయింట్లు పెరిగేందుకు వీలున్నది.
-మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు