Gold Price | పెండ్లిండ్లకు ఆభరణాల సంగతి అటుంచి, కనీసం తాళిబొట్టు సైతం కొనలేక సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. పదేండ్ల క్రితం ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో ఇప్పుడూ అంతే ఉన్నది. కానీ ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ, గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకంతో పుత్తడి ధర గత 12 ఏండ్లలో రెట్టింపయ్యి, సాధారణ ప్రజలకు అందకుండా పోయింది. ఎడాపెడా సుంకాలు, సెస్లు వేసి నిత్యావసరాలతో పాటే పుత్తడి ధరనూ కేంద్రం అమాంతం పెంచేసింది.
అంతర్జాతీయ మార్కెట్లో 2011 ఆగస్టులో ఔన్సు బంగారం ధర 1,896 డాలర్లు. తాజాగా మరో 5 శాతం అధికంగా 1,983 డాలర్లకు చేరింది. మనదేశంలో ప్రజలు ఇప్పుడు పుత్తడిని 125 శాతం ఎక్కువ ధరకు కొనాల్సిన పరిస్థితికి కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. ఆర్బీఐ గోల్డ్బాండ్లను ప్రామాణికంగా తీసుకునే ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) తులం పసిడి సగటు ధర 2011లో రూ.27,200. ఇప్పుడది రూ.61,000. ప్రపంచ మార్కెట్లో, ఇక్కడ ఉన్న ధరల వ్యత్యాసాన్ని అవకాశంగా తీసుకుని స్మగ్లర్లు దేశంలోకి విచ్చలవిడిగా బంగారాన్ని తీసుకొస్తున్నా కేంద్రం చోద్యం చూస్తున్నది. ఎటువంటి అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లు సంకల్పిస్తే ఇప్పటికిప్పుడే దేశంలో బంగారం ధరను దాదాపు రూ.10,000 వరకూ తగ్గించగలరు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలిగే ప్రభుత్వమైతే మరో రూ.22,000 పైగా ధర తగ్గే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్ 2012లో పసిడిపై దిగుమతి సుంకాల్ని పలు దఫాలుగా పెంచేస్తే, అటు తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ పన్నుల్ని మరింతగా ఎగదోసింది. దిగుమతి సుంకాలకు తోడు జీఎస్టీ, సెస్లనీ ఇంకొన్ని వడ్డించింది. 2011లో పుత్తడిపై దిగుమతి సుంకం 2 శాతంకాగా, దీనిని అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం 8 శాతానికి తీసుకుపోతే ఇప్పటి సీతారామన్ 12.5కు పెంచేశారు. ఆగ్రిఇన్ఫ్రా సెస్ పేరుతో మరో 2.5 శాతం వేశారు. గత ఏడాది దిగుమతి సుంకాన్ని 10 శాతం తగ్గించి, సెస్ను 5 శాతానికి పెంచినా, సుంకాలు, సెస్లు యథాతథం. ఇటీవల జీఎస్టీ పేరుతో మరో 3 శాతం అదనం. దీంతో పసిడిపై సుంకాలు, సెస్లు కలిపి 18 శాతానికి చేరింది. బంగారం దిగుమతైన తర్వాత తొలుత సుంకం కలిపి, దీనిపై సెస్ వసూలు చేస్తారు. ఈ రెండింటినీ కలిపితే వచ్చే ధరపై జీఎస్టీ వేస్తారు. ఈ ప్రక్రియ ఫలితంగా ఇతర దేశాలకంటే భారత్లో ప్రజలు 18.5 శాతం పన్నులు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.61,000 ఉండగా, ఇందులో రూ.10,000కుపైగా సుంకాలే, అవి కూడా కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ వడ్డించినవే.
సాధారణంగా ఏ దేశంలోనైనా అంతర్జాతీయ ఆటుపోట్ల భారం ప్రజలపై పడకుండా ధరల అదుపు, సుంకాల్లో రాయితీలు తదితర ఊరట చర్యల్ని ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ద్రవ్యలోటు, కరెంటు ఖాతాలోటు గతి తప్పడం సహజం. కానీ, గత బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాయితీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్లతో ఏ ధరల్లోనూ ఊరట కల్పించలేకపోగా ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటును పెంచుకుంటూ పోయాయి. ఫలితంగా దేశీ కరెన్సీ రూపాయి అట్టడుగు స్థాయికి పడిపోయింది. 2011లో ప్రపంచ మార్కెట్లో ఔన్సు ధర 1,896 డాలర్లు, దేశీయంగా ధర రూ. 27,200 ఉన్న సమయంలో డాలరు మారకంలో రూపాయి విలువ 46.62. ఇప్పుడది 83.25. అంటే అప్పటి ధర కంటే 78.67 శాతం అధికం.