ముంబై, సెప్టెంబర్ 6: దేశ జీడీపీలో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో 5 శాతానికి పెరగవచ్చని భారతీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అధిక వాణిజ్య లోటే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఆగస్టులో దేశ ఎగుమతి-దిగుమతుల మధ్యనున్న వ్యత్యాసం రెండింతలైందని, 28.7 బిలియన్ డాలర్లుగా వాణిజ్య లోటు నమోదైందని ఇక్రా గుర్తుచేసింది. క్రితంతో పోల్చితే గత నెల దేశంలోకి దిగుమతులు 36.8 శాతం పెరిగాయని, దేశం నుంచి ఎగుమతులు మాత్రం 1.2 శాతం తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ‘కరెంట్ ఖాతా లోటు ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్లో ఆల్టైం హై స్థాయిలో 41-43 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చు. దేశ జీడీపీలో ఇది 5 శాతంగా ఉండొచ్చు. 2011-12 అక్టోబర్-డిసెంబర్ నుంచి గమనిస్తే ఇది రెండో గరిష్ఠం’ అని ఇక్రా పేర్కొన్నది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం క్యాడ్ మునుపెన్నడూ లేనివిధంగా 120 బిలియన్ డాలర్లను తాకవచ్చని చెప్పింది. ఇది జీడీపీలో 3.5 శాతానికి సమానం. నిజానికి గత ఆర్థిక సంవత్సరం 38.7 బిలియన్ డాలర్లుగానే ఉన్నది.