ICICI&PNB | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రెపోరేట్ పెంచడమే తరువాయి.. రెండు ప్రధాన బ్యాంకులు కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. అంతకుముందు ద్రవ్యపరపతి సమీక్షలో భాగంగా రెపోరేట్ను 50 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధిక ధరలను కట్టడి చేయడానికి రెపోరేట్ మూడేండ్ల గరిష్ఠ స్థాయి 5.40 శాతానికి ఆర్బీఐ పెంచేసింది. గత ఆరు నెలలుగా చిల్లర ద్రవ్యోల్బణం ఆరు శాతానికి పైగా కొనసాగుతున్నది.
ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ (ఐ-ఈబీఎల్ఆర్) పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో తెలిపింది. దీని ప్రకారం ఐ-ఈబీఎల్ఆర్ 9.10 శాతంగా ఉంటుందని, శుక్రవారం (2022, ఆగస్టు 5) నుంచే పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలోనే ఐసీఐసీఐ బ్యాంక్ తన అన్ని టెన్యూర్ల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 0.15 శాతం పెంచివేసింది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సైతం ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ 7.90 శాతానికి పెంచేసినట్లు పేర్కొంది. ఈ నెల 8 నుంచి రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) 7.40 నుంచి 7.90 శాతానికి పెంచుతున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.