ICICI Bank-Tata Memorial | క్యాన్సర్ రోగులకు అండగా నిలిచేందుకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ముందుకు వచ్చింది. ఎక్కువ మంది క్యాన్సర్ రోగులకు వైద్య వసతులు కల్పించాలన్న లక్ష్యంతో టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ)కి రూ.1200 కోట్ల నిధుల సాయం అందిస్తామని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంతోపాటు దేశవ్యాప్తంగా గల మూడు టీఎంసీ క్యాన్సర్ దవాఖానల విస్తరణకు ఈ నిధులు కేటాయిస్తామని వెల్లడించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద ఈ నిధులు టీఎంసీకి కేటాయిస్తున్నట్లు తెలిపింది.
టీఎంసీ క్యాన్సర్ దవాఖానల విస్తరణలో భాగంగా నవీ ముంబైలోని ఖర్ఘర్ అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్ మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్లో రేడియషన్ అంకాలజీ బ్లాక్తోపాటు పంజాబ్లోని ముల్లాన్ పూర్, విశాఖలోని టీఎంసీ హోమీ బామా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో రెండు పీడియాట్రిక్, హీమటాలాజికల్ అంకాలజీ బ్లాక్లు ఏర్పాటు చేయనున్నది.
కొత్తగా టీఎంసీ ఏర్పాటు చేసే ఈ బ్లాక్లు 2027 నాటికి పూర్తిస్థాయిలో కార్యక్రమాలు ప్రారంభిస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది తెలిపారు. వీటితో ఏటా మరో 25 వేల మంది క్యాన్సర్ ఉద్యోగులకు వైద్య వసతులు అందుబాటులోకి వస్తాయన్నారు.ఇప్పుడు టీఎంసీ ప్రతియేటా 1.2 లక్షల మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నది. ఈ మూడు దవాఖానల విస్తరణకు ఇప్పటికే రూ.500 కోట్ల సీఎస్ఆర్ నిధి అందుబాటులో ఉంది. మొత్తంగా రూ.2500 కోట్లు ఖర్చు చేస్తామన్నారు గిరీష్ చంద్ర చతుర్వేది. టీఎంసీ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ కార్యకలాపాలకు ఐసీఐసీఐ బ్యాంకు తమ సీఎస్ఆర్ నిధుల్లో 50 శాతం ఖర్చు చేయనున్నది.
వచ్చే ఏడేండ్లలో దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగులకు చికిత్స, సేవలను రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) డైరెక్టర్ రాజేంద్ర బాడ్వే తెలిపారు. ఇప్పుడు ఏటా 13 లక్షల మంది క్యాన్సర్ రోగుల్లో 1.3 లక్షల మందికి టాటా హాస్పిటల్ చికిత్స అందిస్తున్నది. 2030 నాటికి 2.6 లక్షల మందికి పెంచాలని లక్ష్యంగా టీఎంసీ పెట్టుకున్నది.