Home Loans | పెరిగిపోతున్న ధరలను కట్టడి చేయడానికి ఆర్బీఐ ఇలా కీలక రెపోరేట్ పెంచిందో లేదో.. అలా వాణిజ్య బ్యాంకులు ఇండ్ల రుణాలపై కీలక వడ్డీరేట్లు పెంచేశాయి. బుధవారం రెపొరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయించిందని ప్రకటించింది. గురువారం ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ మొదలు బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా వడ్డీరేట్లు పెంచాయి. ఐసీఐసీఐ బుధవారం నుంచే పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఆర్బీఐ రెపోరేట్ 36 రోజుల్లో రెండోసారి పెంచేసింది. దీనికి అనుగుణంగా నాలుగు ప్రధాన బ్యాంకులు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్డ్ హోంలోన్ ఇంటరెస్ట్ రేట్ (ఈబీఎల్ఆర్) పెంచేశాయి. అదెలాగో చూద్దామా.
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ పేర్కొన్న ప్రకారం ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేట్ 50 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఐసీఐసీఐ బ్యాంక్ ఈబీఎల్ఆర్ 8.60 శాతానికి పెరిగినట్లయింది. ఇంతకుముందు ఈబీఎల్ఆర్ 8.10 శాతంగా ఉండేది. బుధవారం (2022 జూన్ 8) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది.
ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా ఇండ్ల రుణాలతో సహా వివిధ రకాల రుణాలపై బరోడా రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (బీఆర్ఎల్ఎల్ఆర్) పెంచేసినట్లు వెల్లడించింది. గురువారం నుంచి పెరుగుదల అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా బీఆర్ఎల్ఎల్ఆర్ 7.40 శాతం నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు ఇండ్ల రుణాలపై ఆర్ఎల్ఎల్ఆర్ 7.40-8.75 శాతం మధ్య అమలవుతున్నాయి. మార్టగేజ్ రుణాలపై వడ్డీరేటు 9.10 కార్ల రుణాలపై 7.90 శాతం నుంచి మొదలవుతుంది.
ఆర్బీఐ రెపోరేట్ సవరించిన అంచనాల ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపొరేట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్) 7.75 శాతంగా ఉంటుంది. ఇది బుధవారం నుంచే అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటించింది.
మిగతా బ్యాంకుల మాదిరిగానే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆర్బీఐ రెపోరేట్ అనుబంధ లెండింగ్ రేట్ పెంచేసింది. ఇప్పటి వరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపొరేట్ బేస్డ్ లెండింగ్ రేట్ 7.25 శాతంగా ఉండేది. తాజా ఆర్బీఐ నిర్ణయంతో 7.75 శాతానికి పెరిగింది. గురువారం నుంచి ఈ పెరుగుదల అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది.
ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేట్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఆర్బీఎల్ఆర్) సవరించింది. ఇంతకుముందు 7.25 శాతంగా ఉన్న ఆర్బీఎల్ఆర్ ఇక నుంచి 7.75 శాతం నుంచి మొదలవుతుంది.
దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కూడా మిగతా బ్యాంకుల బాటలోనే పయనించింది. రెపోరేట్ ఆధారిత వడ్డీరేటు సవరించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు పీఎన్బీలో 6.90 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది. ఇక నుంచి 7.40 శాతంగా మారనున్నది.