న్యూఢిల్లీ : చాట్జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ వంటి జనరేటివ్ ఏఐ టూల్స్తో ఉత్పాదకత పెరిగినా బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ అన్నారు. ఏఐ టెక్నాలజీ నాణ్యమైన జీవితాన్ని అందించగలదని పేర్కొన్నారు. ఏఐ బూమ్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని ఏఐ టెక్ దిగ్గజం యోచిస్తున్న నేపధ్యంలో అరవింద్ కృష్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూ టెక్నాలజీని యాక్సెస్ చేసుకునేందుకు సంస్ధలకు సాయపడేలా ఐబీఎం ఇటీవల జనరేటివ్ ఏఐ ప్లాట్ఫాంలతో కూడిన వేదిక వాట్సన్ఎక్స్ను ఐబీఎం ఇటీవల ప్రవేశపెట్టింది. ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐబీఎం చీఫ్ మాట్లాడుతూ తక్కువ మంది ఉద్యోగులతో చాట్జీపీటీ వంటి ఏఐ మోడల్స్ ఉత్పాదకతను అందించేలా సాయపడతాయని పేర్కొన్నారు.
ఏఐ టూల్స్ రాకతో ముందుగా బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని తాను నమ్ముతున్నానని అరవింద్ కృష్ణ చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన ఎకానమీలను ప్రధానంగా ఆయన ప్రస్తావించారు. ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీతో ఐబీఎం 30 శాతం ఉద్యోగాలను రీప్లేస్ చేస్తుందని గతంలో తాను చేసిన ప్రకటనపైనా ఐబీఎం సీఈవో స్పందించారు. న్యూ టెక్నాలజీ ఆఫీస్ వర్క్పై ప్రభావం చూపుతుందని, ఇది ఐబీఎంలోనూ జరుగుతుందని స్పష్టం చేశారు. అరవింద్ కృష్ణ వివరణతో ఐబీఎంలో భారీ కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Read More :
Meta Layoffs | మార్క్ జుకర్బర్గ్ ప్రశంసించిన టెకీపై మెటా వేటు