న్యూఢిల్లీ, నవంబర్ 19: అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం భారత్లో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. దేశంలో మరిన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటుచేస్తామని, డిజిటలైజేషన్ ప్రయాణంలో ప్రభుత్వంతో జతకలవాలని చూస్తున్నామని ఐబీఎం చైర్మన్, సీఈవో అర్వింద్ కృష్ణ చెప్పారు. ఇండియా పర్యటనకు వచ్చిన కృష్ణ శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ల్ని కలసి స్కిల్లింగ్, వర్క్ఫోర్స్ డెవలప్మెంట్తో సహా భాగస్వామ్యం కుదుర్చుకునే అంశాల్ని చర్చించారు. ఈ సందర్భంగా ఐబీఎం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ భారత్లో తమ కంపెనీ ఇప్పటికే బాగా విస్తరించిందని, హైదరాబాద్, బెంగళూరు, పుణెల్లో పెద్ద సెంటర్లు ఉన్నాయని, ఢిల్లీలో చిన్న ఆర్ అండ్ డీ సెంటర్ ఉందన్నారు. అహ్మదాబాద్, కొచ్ఛిల్లో సెంటర్ల ఏర్పాటును తాజాగా ప్రకటించామన్నారు. మరో కొన్ని సెంటర్లు తెరవాలన్న ప్రణాళిక ఉందని, వాటిని ముందుగా వెల్లడించనని చెప్పారు. ఐబీఎం కన్సల్టింగ్ ఈ వారం ప్రారంభంలోనే హైదరాబాద్లో కొత్త బీపీవో కేంద్రాన్ని ప్రారంభించిన సంగతి గమనార్హం. ఇండియాతో సహా వివిధ దేశాల్లో వ్యాపార విస్తరణకు అంతర్జాతీయంగా మూడేండ్లలో 35 బిలియన్ డాలర్ల నగదును సంపాదించాలని తమ కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు అర్వింద్ కృష్ణ వెల్లడించారు.
ఇండియాలో తమ వ్యాపారంపట్ల సంతోషంగా ఉన్నామని, ఫైనాన్షియల్ సర్వీసులు, టెలికం, ప్రభుత్వ పారిశ్రామిక సంస్థలు తదితరాలతో మంచి కాంట్రాక్టులు చేస్తున్నామని ఐబీఎం చీఫ్ చెప్పారు. ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తమ ఆసియా ఆదాయం బాగా పెరిగిందని, అందులో ఇండియా వాటా ఎక్కువని, గత రెండు దశాబ్దాల్లో లేని ఎన్నో వ్యాపార అవకాశాలు ఇప్పుడు ఇండియాలో ఉన్నాయని వివరించారు. తమ వ్యాపారంలో 70 శాతం ఆదాయం సాఫ్ట్వేర్, కన్సల్టింగ్ ద్వారా సమకూరుతున్నదన్నారు. కాన్పూర్లో ఐఐటీ చేసిన అర్వింద్ కృష్ణ సంస్థకు సీఈవోగా నియమితులైనప్పటి నుంచి హైబ్రీడ్ క్లౌడ్, ఏఐ సామర్థ్యాల్ని పెంచుకునేందుకు 17 కంపెనీల్ని ఐబీఎం కొన్నది. గత ఆరునెలల్లో భారత్లో టైర్ టూ నగరాల్లోకి విస్తరించి, నియామకాల్ని వేగవంతం చేసింది. వచ్చే ఐదేండ్లలో ఇండియాలో 5 లక్షల మందికి ఐబీఎం సైబర్ సెక్యూరిటీపై శిక్షణ ఇస్తుందని కృష్ణ తెలిపారు.