IT Refund | వేతన జీవులు, వ్యాపారులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ కు సంబంధించి ఐటీ రీఫండ్స్ విషయంలో ఆదాయం పన్ను విభాగం (Income Tax Department) కీలక నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సర ఐటీ రిటర్న్స్లో రీఫండ్ రావాలంటే అంతకుముందు పన్ను బకాయిలు క్లియర్ చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయమై తాము ఇచ్చిన లేఖలు, నోటీసులకు సకాలంలో స్పందించాలని వేతన జీవులకు ఐటీ విభాగం తేల్చి చెప్పింది.
సాధ్యమైనంత త్వరగా ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ చేసి.. రీఫండ్ చేయడానికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఐటీ విభాగం ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా ప్రకటించింది. కొందరు వేతన జీవులు ఇంతకుముందు ఆర్థిక సంవత్సరాల్లో సెటిల్ కాని పన్ను డిమాండ్లపై నోటీసు, సమాచారం ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఐటీ విభాగం పై విధంగా వివరణ ఇచ్చింది.
గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 7.09 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వాటిల్లో 6.96 కోట్ల రిటర్న్స్ వెరిఫికేషన్ పూర్తయిందని ఐటీ విభాగం వెల్లడించింది. అందులోనూ 6.46 కోట్ల ఐటీఆర్లు ప్రాసెస్ చేయగా, 2.75 కోట్ల రీఫండ్స్ రిటర్న్ చేశామని కూడా తెలిపింది. కొందరు ఐటీ పేమెంట్స్ విషయంలో డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయని ఐటీ విభాగం పేర్కొంది. 1961 ఆదాయం పన్ను చట్టంలోని 245 (1) సెక్షన్ కింద పాత డిమాండ్లు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపింది.