Hyundai | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా.. తమిళనాడులో రూ.6,180 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది. తమిళనాడులో హైడ్రోజన్ రీసోర్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 2023-32 మధ్య పదేండ్ల కాలంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడతామని చేసిన ప్రకటనకు ఇది అదనం. ఎలక్ట్రికల్ వెహికల్స్ కార్ల మాన్యుఫాక్చరింగ్ యూనిట్, చార్జింగ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.6,180 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఇందుకోసం సోమవారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ -2024’లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎంఓయూ కుదుర్చుకున్నది.
రాష్ట్రంలో సామాజిక- ఆర్థికాభివృద్ధి, భారత్ స్వావలంభనకు తమ పెట్టుబడులు ఖర్చు చేస్తామని హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ కం సీఈఓ ఉన్ సూ కిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. మద్రాస్ ఐఐటీతోపాటు కలిసి రూ.180 కోట్లతో హైడ్రోజన్ వ్యాలీ ఇన్నోవేషన్ హబ్ నిర్మిస్తామని హ్యుండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. ఇందుకోస్ ఐఐటీ మద్రాస్తో ఎంఓయూపై హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సంతకాలు చేసింది. హైడ్రోజన్ ఎకో సిస్టమ్ లోకలైజేషన్ కోసం ఇంకుబేషన్ సెల్ ఏర్పాటు చేస్తామని తెలిపింది.