హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): డాటా స్టోరేజ్, విశ్లేషణల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన హైపర్సేల్ డాటా సెంటర్.. హైదరాబాద్లో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్నది. తమ అనుబంధ సంస్థ నెక్స్ట్రా డాటా సెంటర్స్ ద్వారా ప్రముఖ దేశీయ ప్రైవేట్ రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ ఈ డాటా సెంటర్ను నెలకొల్పనున్నది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయల కోసం రూ.2వేల కోట్లను పెట్టుబడిగా పెడుతామని ఎయిర్టెల్ ప్రకటించింది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో ఎయిర్టెల్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, వైస్ చైర్మన్, ఎండీ రాజన్ భారతీ మిట్టల్ సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే తొలి దశలో 60 మెగావాట్ల ఐటీ లోడ్ సామర్థ్యంతో హైపర్సేల్ డాటా సెంటర్ను హైదరాబాద్లో తెస్తున్నట్టు ప్రకటించారు. డాటా భద్రతలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే ఈ డాటా సెంటర్.. రాబోయే 5-7 ఏండ్లలో అందుబాటులోకి వస్తుందని అంచనా.
‘హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే హైపర్సేల్ డాటా సెంటర్.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ డాటా సెంటర్ ప్రాజెక్ట్లలో ఒకటి. గత ఏడాది మే నెలలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో ప్రారంభమైన డాటా సెంటర్ ఏర్పాటు చర్చలు.. నెలల వ్యవధిలోనే కార్యరూపం దాల్చాయి. ఇందుకు కారణం తెలంగాణ ప్రభుత్వం ఎంతో వేగంగా తీసుకున్న చర్యలే అని భారతీ ఎయిర్టెల్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అన్నారు. ఇటువంటి ప్రజా నాయకత్వంతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని, ఇతర రంగాల్లోనూ మా ఉనికి, ముద్రను చాటుకోవడానికి ఇక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు.
‘ఎయిర్టెల్-నెక్స్ట్రా తెలంగాణలో పెట్టుబడి పెట్టడం చాలా అనందంగా ఉన్నది. దేశంలో హైపర్సేల్ డాటా సెంటర్లకు హైదరాబాద్ హబ్గా మారింది. ఎయిర్టెల్ తాజా పెట్టుబడితో మేము ఆశిస్తున్న మరిన్ని ఫలితాలు వస్తాయని నమ్ముతున్నాను. ఎయిర్టెల్, తెలంగాణ మధ్య ఈ సంబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ, పారిశ్రామిక రంగాల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎయిర్టెల్-నెక్సాట్రాతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది’
-కే తారక రామారావు,రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి