హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో నివాస గృహాల రిజిస్ట్రేషన్లలో గణనీయమైన వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది. జూలై నెలలో మొత్తం ఆస్తులు 5,557 రిజిస్ట్రేషన్లు కాగా వాటి ద్వారా మొత్తం రూ.2,878 కోట్ల ఆదాయం వచ్చిందని, గత ఏడాది నమోదైన ఆస్తుల విలువతో పోలిస్తే 35 శాతం పెరిగిందని నివేదికలో పేర్కొంది.
గతేడాది 2022 జూలైలో మొత్తం ఆస్తులు 4,406 రిజిస్ట్రేషన్లు కాగా వాటి విలువ రూ.2,128 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇందులో రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల విలువ చేసే ఆస్తులే అధికంగా 52 శాతం ఉండగా, రూ.50 లక్షల పైబడిన ఆస్తుల శాతం 15 శాతం, రూ.25 లక్షల కంటే తక్కువ ఉన్న ఆస్తులు 18 శాతంగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది.