Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నివాస గృహ విక్రయాలు, నూతన ప్రాజెక్టుల ప్రారంభాల్లో హైదరాబాద్ దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే మెరుగైన స్థానంలో ఉంటున్నది. గత ఏడాది బెంగళూరు, ముంబై కన్నా ముందు వరుసలో నిలిచింది. ఈ మేరకు తాజా నివేదికలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ప్రాప్ ఈక్విటీ పేర్కొన్నది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నగరంలో కల్పిస్తున్న మౌలిక వసతులే కీలకంగా మారాయని, అలాగే ఐటీ పరిశ్రమ విస్తరణతో పెరుగుతున్న ఉద్యోగాలు మరో కారణమని ఈ సందర్భంగా ప్రాప్ ఈక్విటీ అభిప్రాయపడింది.
ఈ క్రమంలోనే గత ఏడాది నివాస గృహాల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో హైదరాబాద్ మరోసారి సత్తా చాటినట్టు చెప్పింది. ఈ నివేదిక ప్రకారం హైదరాబాద్లో 66,683 నూతన యూనిట్ల ప్రారంభోత్సవం జరిగింది. బెంగళూరు, ముంబై, నవీ ముంబై, చెన్నైలతో పోల్చితే ఇది ఎక్కువ. ప్రాప్ ఈక్విటీ ఎండీ సమీర్ జసుజా మాట్లాడుతూ గత ఏడాది దేశంలోనే హైదరాబాద్ రెండో అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్గా అవతరించిందన్నారు. ముంబై తర్వాత హైదరాబాదేనని చెప్పారు.