హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 21వ బయోఏషియా-2024 వార్షిక సదస్సును మంగళవారం హెచ్ఐసీసీలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణ వ్యాప్తంగా 10 ఫార్మా విలేజ్ల ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే మొదలైందని చెప్పారు.
దీంతో మౌలిక సదుపాయాలతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేగాక 5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. అలాగే రూ.2,000 కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల్లో త్వరలో జీనోమ్ వ్యాలీ రెండో దశను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో కంపెనీలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చేవారికి ప్రభుత్వం నుంచి అన్నిరకాల సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ముందుగా 3 జిల్లాల్లో..
వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ ఫార్మా విలేజ్లను తొలుత ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరయ్యే రీతిలోనే వీటిని తెస్తున్నట్టు చెప్పారు. ఇక ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక సందర్భంగా రాష్ర్టానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు గుర్తుచేశారు. ఈ క్రమంలోనే హైదరాబాదీ సంస్థలతో ఆయా దేశాల కంపెనీలు జట్టు కడుతుండటం, నగరంలో వివిధ పెట్టుబడులకు దిగుతుండటంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నుంచే భరోసా..
కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలున్న పరిస్థితుల్లో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న బయోఏషియా సదస్సు ప్రాధాన్యత సంతరించుకున్నదని పేర్కొన్నారు. అయితే కరోనా ప్రపంచానికి భయాన్ని కల్పిస్తే, హైదరాబాద్ నమ్మకాన్ని కల్పించిందన్నారు. ఆరోగ్య సమస్యలనేవి మానవాళి మొత్తానికి ఒకేలా ఉంటాయన్న ఆయన.. వాటి పరిష్కారానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను కోవిడ్ చాటిచెప్పిందన్నారు.
హైదరాబాద్ నేడు లైఫ్సైన్సెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఎదిగిందని, కోవిడ్ కారణంగా ప్రపంచమంతా భయంతో అతలాకుతలమైన సందర్భంలో మూడు వ్యాక్సిన్లలో ఒకటి ప్రపంచానికి నగరంలోని సంస్థే అందించిందని గుర్తుచేశారు. గత రెండు దశాబ్దాలుగా బయోఏషియా సదస్సు ఫార్మా, జీవశాస్ర్తాల రంగం అభివృద్ధికి తోడ్పడుతూ మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని కొనియాడారు. ఐటీ, సాఫ్ట్వేర్, రిసెర్చ్, స్టార్టప్స్కూ హైదరాబాద్ క్యాపిటల్గా మారిందన్నారు. విధానాలు, మౌలిక సదుపాయాలపరంగా పరిశ్రమకు సహకరించేందుకు, ఇందుకు అవసరమైన ఎకోసిస్టంను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం భరోసా ఇచ్చారు.
ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత
తమ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, ఇవి స్టార్టప్స్కు, బడా కార్పొరేట్ కంపెనీలకు మధ్య వారధిగా ఉంటాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫార్మా రంగంలోని సమస్యలను తెలుసుకునేందుకు ఇటీవలే తాను ఆ రంగానికి చెందిన ప్రముఖులతో సమావేశమైనట్టు ప్రభుత్వపరంగా వీలైనంత సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారికి భరోసా కల్పించామని తెలిపారు.
కాగా, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ గ్రెగ్ ఎల్ సెమెంజాకు జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్ అవార్డు-2024ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రదానం చేశారు. అలాగే ‘ఇండియన్ ఫార్మా ట్రాన్స్ఫార్మేషన్ డాటా అండ్ ఏఐ’ పేరుతో బయోఏషియా-2024పై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న తకేడా, బయోలాజికల్ ఈ, మిల్టెనీ బయోటెక్, టర్మినస్ గ్రూప్, ఆర్ఎక్స్ ప్రొపెలెంట్ కంపెనీల ప్రతినిధులనూ సత్కరించారు.
కొత్త లైఫ్సైన్సెస్ పాలసీ
వచ్చే కొద్ది నెలల్లోనే కొత్త లైఫ్సైన్సెస్ పాలసీని ప్రవేశపెడతామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా టెక్నాలజీ, లైఫ్సైన్సెస్, ఔషధాలు, స్టార్టప్స్, రెగ్యులేటరీ తదితర అంశాల సమ్మిళితంగా ఈ పాలసీ ఉంటుందన్నారు. లైఫ్సైన్సెస్ రంగంలో తెలంగాణను ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.
గత 20 ఏండ్లుగా జరుగుతున్న బయోఏషియా సదస్సు ద్వారా ఫార్మా, లైఫ్సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు లభించిందని, ఫలితంగా దావోస్ సదస్సు సందర్భంగా ప్రపంచంలోని అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని మంత్రి పేర్కొన్నారు. బీఎంఎస్, ప్రావిడెన్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని, వారికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. లైఫ్సైన్సెస్ రంగం అభివృద్ధికి తమ శాయశక్తులా కృషిచేస్తామని భరోసా ఇచ్చారు.
ఇక పెట్టుబడుల ఆకర్షణ ద్వారా సామాజిక, ఆర్థికాభివృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు సీఎం కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. వచ్చే రెండేండ్లలో విద్యా సంస్థలు, పరిశ్రమను అనుసంధానం చేసేలా ఓ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
విద్యార్థులకు పరిశ్రమలో 3-6 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ను తప్పనిసరి చేస్తామని, ఇది ఉద్యోగాలు పొందేందుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఆయా రంగాలకు అవసరమైన నైపుణ్యాలుగల ప్రతిభావంతులతో బెస్ట్ హ్యూమన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఎదుగుతుందన్న ఆశాభావాన్ని శ్రీధర్ బాబు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ మంత్రితోపాటు రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, బయోఏషియా సదస్సు సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
ఇతర అవసరాలకు ఫార్మాసిటీ భూములు
రాష్ట్రవ్యాప్తంగా 10 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నామని, ఒక్కో క్లస్టర్ 1,000 నుంచి 2,000 ఎకరాల్లో ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. పర్యావరణ సమస్యలు రాకుండా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం కాకుండా రాష్ట్రమంతా విస్తరింపజేయడమే తమ విధానమని చెప్పారు. వచ్చే ఐదేండ్లలో 20 నుంచి 30 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు జీనోమ్ వ్యాలీకి వస్తాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ప్రపంచ వాణిజ్య వేదిక సదస్సు తరహాలోనే లైఫ్సైన్సెస్ రంగంలో బయోఏషియా ఎదగడం మనందరికీ గర్వకారణమన్నారు. 2000 పైచిలుకు రిజిస్ట్రేషన్లు మొదటిరోజే నమోదయ్యాయని, ఇందులో ఫార్చ్యూన్-500 కంపెనీలకు చెందిన సీఈవోలు పాల్గొంటున్నారన్నారు.
జపాన్ కంపెనీతో బీఈ జట్టు
బయోలాజికల్-ఈ లిమిటెడ్(బీఈ).. జపాన్ కంపెనీ తకేడా ఫార్మాతో జట్టుకట్టింది. ప్రస్తుతం ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లను తయారు చేస్తున్న బీఈ..తకేడాతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఈ సామర్థ్యం రెండింతలు కానున్నదని బీఈ ఎండీ మహిమ దాట్లా తెలిపారు. 2030 నాటికి డెంగ్యూ వ్యాక్సిన్ల కెపాసిటీని 10 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అందుకు తగ్గట్టుగానే ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా క్యూడెంగ్యూ(డెంగ్యూ టెట్రావాలెంట్ వ్యాక్సి న్) మల్టీ-డోస్ వైల్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ప్రకటించింది.
జాతీయ ఇమ్యూనైజేషన్ ప్రొగ్రాములో భాగంగా ప్యాకేజింగ్ను తగ్గించడం, స్టోరేజీ ఖర్చులు తగ్గించుకోవడం, మెడికల్, పర్యావరణ వ్యర్థాలు తగ్గించే ఉద్దేశంలో భాగంగా కేంద్రం ప్రవేశపెట్టింది. దీంట్లోభాగంగానే బీఈ..జపాన్కు చెందిన తకేడాతో ఒప్పందం కుదుర్చుకొనే అక్కడే ఈ వ్యాక్సిన్లను తయా రు చేయబోతున్నది. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ జ్వరంతో బాధపడేవారి సంఖ్య 30 రెట్లు పెరిగారని, ముఖ్యంగా పట్టణీకరణ, రవాణా, వాతావరణంలో వచ్చే మార్పులు కారణంగా ఈ వ్యాధి వస్తున్నదని పేర్కొంది. ప్రతియేటా 100 దేశాల్లో 39 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ యూరప్తోపాటు ఇండోనేషియా, థాయిలాండ్, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల్లో లభిస్తుండగా.. భారత్లో మాత్రం లభించడం లేదు.
హెల్త్కేర్ రంగంలో పెట్టుబడులకు సిద్ధం
వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్
రాష్ట్ర హెల్త్కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు వెస్ట్రన్ ఆస్ట్రేలియా మంత్రి సాండర్సన్ తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బయోఏషియా సదస్సులో ఆమె రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..దేశంలో తొలి కమర్షియల్ కార్యాలయాన్ని కూడా ఇక్కడే ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. హెల్త్కేర్, హెల్త్ టూరిజం, హెల్త్ స్కీలింగ్ విభాగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నాయని ఈ సందర్భంగా సీఎం ఫార్మా దిగ్గజాలకు సూచించారు. సీఎంను కలిసిన వారిలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఎండీ జెర్మీజూర్గన్స్ కూడా ఉన్నారు.
రాష్ట్ర వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సూచించిన ఆయన..ప్రధానంగా వ్యాపార పంటలపైన దృష్టి సారించాలన్నారు. సెమికండక్టర్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి మరికొందరు పారిశ్రామికవేత్తలు ముందుకురాగా, కావాల్సిన భూమితో పాటు ఇతర సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో కూడా పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్గా కొనసాగుతున్నదని, మరిన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు.