న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రాపర్టీ మార్కెట్ పరుగులు పెడుతున్నది. హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హౌజింగ్ ధరలు నిరుడు ఇదే వ్యవధితో పోల్చితే 6 శాతం పెరిగాయి. ఈ మేరకు క్రెడాయ్, కొల్లీర్స్ ఇండియా, లియాసెస్ ఫోరాస్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదికలో తేలింది. హైదరాబాద్లో సగటు హౌజింగ్ ధరలు 8 శాతం ఎగబాకి చదరపు అడుగు రూ.9,266కు చేరినట్టు స్పష్టమైంది. కాగా, ఢిల్లీ-ఎన్సీఆర్లో అత్యధికంగా 14 శాతం ఎగిసి చదరపు అడుగు రూ.7,741గా ఉన్నది. గోల్ఫ్ కోర్స్ రోడ్, ఘజియాబాద్లలో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక తెలిపింది. ఇక కోల్కతా, అహ్మదాబాద్, పుణె, బెంగళూరుల్లోనూ హౌజింగ్ ధరలు 12, 11, 9, 6 శాతం చొప్పున పెరిగాయి. అయితే చెన్నై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ధరలు స్థిరంగా ఉన్నాయి.
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తర్వాత హైదరాబాద్లోనే చదరపు అడుగు ధర అత్యధికంగా నమోదైంది. ఎంఎంఆర్లో చదరపు అడుగు రూ.19,485గా ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత హైదరాబాద్లోనే రూ.9,266గా ఉన్నట్టు క్రెడాయ్, కొల్లీర్స్, లియాసెస్ తెలిపాయి. ఈ ఏడాది మొదలు హౌజింగ్ ధరలు క్రమేణా పెరుగుతూపోతున్నాయని, నిరుడుతో చూస్తే మార్కెట్లో వ్యాపార కార్యకలాపాలు పెరిగాయని వివరించాయి.
సిమెంట్, ఐరన్ ఇతరత్రా నిర్మాణ రంగ ముడి సరుకుల ధరలు పెరిగాయని తాజా నివేదికలో క్రెడాయ్, కొల్లీర్స్, లియాసెస్ పేర్కొన్నాయి. దీంతో గతంతో పోల్చితే నిర్మాణ వ్యయం మరింత పెరిగిందన్నాయి. అయినప్పటికీ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతుండటంపట్ల ఆనందం వ్యక్తం చేశాయి. అయితే ధరలు మరింత పెరిగితే కొంతమేర డిమాండ్ తగ్గుదలకు దారితీయవచ్చన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.