గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)లకు హైదరాబాద్ అనుకూలంగా మారింది.రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భౌగోళిక స్వరూపం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక వసతులు.. ఇలా అనేకాంశాలు దోహదం చేస్తున్నాయి.ఫలితంగా ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలన్నీ తెలంగాణ వైపు క్యూ కడుతున్నాయి. ఇక్కడ జీసీసీల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారుల కోసం కంపెనీల కార్యకలాపాల నిర్వహణలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఎంతో కీలకంగా మారా యి. ఈ జీసీసీలకు ఇప్పుడు హైదరాబాద్ వేదికవుతున్నది. కొన్ని పెద్ద కంపెనీలు తమ జీసీసీలను ఎక్స్లెన్స్ సెంటర్లుగానూ పరిగణిస్తున్నాయి. ఇక జీసీసీలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి ఇటీవల హైదరాబాద్ కేంద్రం గా నాసామ్ జీసీసీ కాన్క్లేవ్-2022ను సైతం నిర్వహించింది.
ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ చాలా అనుకూలంగా ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇతర నగరాలతో పోల్చితే ఇక్కడున్న మౌలిక సదుపాయాలు అసమానమైనవిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచైనా, నగరంలోని ఏదైనా ప్రధాన ప్రాంతాల నుంచైనా.. ఐటీ కారిడార్లోని గమ్యస్థానానికి గంటలోపు చేరుకోవచ్చు. దీనికితోడు నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో రైలు కనెక్టివిటీ ఉన్నది.
అంతేగాక వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ) కింద 30 ఫె్లైఓవర్లు నిర్మించగా, మరిన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయి. మొత్తంగా 47 ఫె్లైఓవర్లను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసి దశలవారీగా నిర్మిస్తోంది. ప్రభుత్వ పనితీరు వల్లే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న సంస్థ మెర్సెర్ వరుసగా ఆరేండ్లుగా హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఎంపిక చేసింది.
ఇక భద్రతపరంగా నగరంలో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఉన్నది. ఇది ఐటీ కారిడార్లలో కంపెనీలకు భద్రత, ప్రత్యేకంగా మహిళల రక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నది. పోలీసు శాఖ-ఐటీ పరిశ్రమల మధ్య దీన్ని ఏర్పాటుచేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు అనుకూలంగా మారాయి.
ఏ రంగానికి చెందిన సంస్థకైనా నైపుణ్యం, ప్రతిభ కలిగిన మానవ వనరులే కీలకం. ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు చేత పట్టుకొని బయటకు వస్తున్నా, వారికి కంపెనీల్లో పనిచేసే నైపుణ్యం మాత్రం ఉండటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం.. టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) కేంద్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసింది. దీనిద్వారా ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని, విద్యా సంస్థల్లో చదువుతున్నవారికి నేరుగా ఆయా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని కల్పించే విధంగా టాస్క్ పలు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే 27 సంస్థలతో టాస్క్ ఒప్పందం కుదుర్చుకొని ఉండగా, ఇటీవల కొత్తగా మరో 26 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నది. టాస్, తన సొంత ఖర్చుతో జీసీసీల అవసరాలకు అనుగుణంగా ఇండక్షన్ ప్రోగ్రామ్లనూ నిర్వహిస్తోంది. మరే రాష్ట్రం ఇలాంటి కార్యక్రమాలను చేయడం లేదు.
దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటరైన టీ-హబ్ను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించి ఈ మధ్యే ప్రారంభించింది. దీంతోపాటు ఆవిష్కరణల కోసం వి-హబ్, టీ వర్క్స్, రిచ్, టీఎస్ఐసీ వంటివీ కృషి చేస్తున్నాయి. అలాగే ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చెయిన్, క్లౌడ్, రోబోటిక్స్, డ్రోన్లు, 3డీ తయారీ వంటి అత్యాధునిక టెక్నాలజీలపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఈ సందర్భంగా సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
దేశంలోనే ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో హైదరాబాద్ మహానగరం గణనీయమైన వృద్ధిని సాధించింది. అందుకు నిదర్శనం ఏటా జరుగుతున్న ఐటీ ఎగుమతులే. ఇక గ్లోబల్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, యాపిల్, వెల్స్ ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బ్రాడ్రిడ్జ్, ఏడీపీ, జేపీ మోర్గాన్, నోవార్టిస్, డెలాయిట్ తదితర సంస్థలకు హైదరాబాద్లో జీసీసీ కేంద్రాలున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత డీబీఎస్ బ్యాంక్, పెప్సీ, చబ్, మాస్ మ్యూచువల్, గోల్డ్మన్ సాచ్స్, స్విస్ రీ, అడ్వాన్స్డ్ ఆటోపార్ట్స్, ఆర్సీసీఎం, జీఏపీ, జెడ్ఎఫ్, స్టేట్ స్ట్రీట్, ఇంటెల్, ఐసీఈ, ఎఫ్5 నెట్వర్ల వంటివి వచ్చాయి. ఇటీవల మైక్రాన్, కాల్అవే గోల్ఫ్ వంటి కంపెనీలూ తమ జీసీసీల కోసం హైదరాబాద్ను ఎంచుకున్నాయి.