హైదరాబాద్, సెప్టెంబర్ 15: అంతర్జాతీయ సంస్థల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, ఇక్కడ ఆయా సంస్థలు తమ రెండో కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచితా దత్త అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో గ్లోబల్ సంస్థలు ఇక్కడ ప్లాంట్లు, కార్యాలయాలను తెరుస్తున్నాయని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తుండటం కూడా ఇందుకు కారణమన్నారు.
టెక్నాలజీ, టెలికం రంగాల హబ్గా మారిపోవడంతో ఇక్కడి స్టాఫింగ్ సంస్థలతో ఒప్పందం కుదర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. మరోవైపు, జూలై 2022 నుంచి జూన్ 2023 వరకు ఐఎస్ఎఫ్లో ఉన్న సభ్యుల కంపెనీలు1.31 లక్షల మంది నూతన ఫార్మాల్ కాంట్రాక్ట్ వర్క ర్లు తీసుకున్నారని తెలిపారు. స్టాఫింగ్ ఇండస్ట్రీ ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, గతేడాది 12.5 శాతం వృద్ధి కనబరిచిందన్నారు. కీలక రంగాలైన ఈ-కామర్స్, లాజిస్టిక్, తయారీ, ఆరోగ్య, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ, రిటైల్, బ్యాంకింగ్ రంగాల్లోని సంస్థలు తాత్కాలిక ఉద్యోగులు అధికంగా తీసుకుంటున్నాయని, ముఖ్యంగా ఈ పండుగ సీజన్లో ఈ-కామర్స్, రిటైల్ సంస్థలు పెద్ద ఎత్తున తాత్కాలిక ఉద్యోగులను తీసుకుంటున్నాయని చెప్పారు.