Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ను తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. సుస్థిరమైన ప్రభుత్వం, సమర్థ నాయకత్వానికి తోడు మెరుగైన మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, అనుకూల వాతావరణం ఉండటంతో నగరానికి ప్రపంచ స్థాయి కంపెనీలు భారీ పెట్టుబడులతో క్యూ కట్టాయి. ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణలో 9 ఏండ్లలోనే ఐటీ రంగ ముఖచిత్రమే మారిపోయింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన అమెజాన్.. హైదరాబాద్ కేంద్రంగా తమ అతి పెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. అంతేకాదు ఆపిల్, మెటా, క్వాల్కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్ట్రానిక్స్, ఉబెర్, సేల్స్ఫోర్స్, వన్ప్లస్, ఒప్పోతో పాటు మరిన్ని దిగ్గజ కంపెనీలు నగరంలో తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను ఏర్పాటు చేశాయి.
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగళూరుతో పోటీ పడుతూ హైదరాబాద్ దూసుకెళ్తున్నది. నగరంలో ఉన్న అనుకూల పరిస్థితులతోనే దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు భారీ పెట్టుబడులతో వస్తూ లక్షల మందికి ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20కి పైగా బహుళ జాతీయ కంపెనీలు (ఎంఎన్సీ) హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలు నగరానికి వస్తుండటంతో ఐటీ ప్రాధాన్యాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లకోసారి (2016, 2021లలో) ఐటీ పాలసీలను రూపొందించి సమర్థంగా అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో ఎక్కడో ఓ చోట కొత్త కంపెనీల కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. వారం వ్యవధిలోనే 5 కంపెనీలు కొత్తగా తమ కార్యాలయాలను ప్రారంభించాయి. ఈ జాబితాలో దేశీయ కంపెనీ టైటాన్ స్మార్ట్ ల్యాబ్స్తో పాటు వయాసాట్ ఇంక్, లోకజ్ ఇంక్, ప్రాక్టెరా ఎడ్జ్, టైగర్ అనలిటిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఆగస్టులో ఇక్కడ తమ కార్యాలయాలను ప్రారంభించాయి. ఇలా ప్రతి నెలా ఐటీ, ఐటీ ఆధారిత బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కంపెనీలు హైదరాబాద్ను తమ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకొంటున్నాయి. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం చూపుతుండటంతో కంపెనీలు నగరంపై మరింతగా ఆసక్తి చూపుతున్నాయంటున్నారు.
దేశంలో భౌగోళికంగా అత్యంత అనుకూలమైన, అనువైన ప్రాంతంగా హైదరాబాద్కు గుర్తింపు ఉన్నది. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నగరంలో మౌలిక వసతులకు కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చి, కొత్తగా 35 ఫ్లైఓవర్లు, లింక్రోడ్లు, అండర్పాస్లను నిర్మించింది. నిరంతర నాణ్యమైన విద్యుత్తు, 50 ఏండ్లకు సరిపడా మంచినీటికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటి తరలించేందుకు పైప్లైన్ నెట్వర్క్, రిజర్వాయర్లు, ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించింది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసింది. ఇలా అనేక విభాగాల్లో బెంగళూరును హైదరాబాద్ వెనక్కి నెట్టినట్టు పలు నివేదికల్లో వెల్లడైంది. దీంతో హైదరాబాద్లో ఐటీ రంగంలో పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇదే విషయాన్ని మాన్స్టర్.కామ్ ఈ సందర్భంగా ఒక నివేదికలో వెల్లడించింది.