న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: ఖతార్ రాజధాని నగరం దోహాకు హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రకటించింది టాటా గ్రూప్నకు చెందిన ఎయిర్ ఇండియా. ఈ నవంబర్, డిసెంబర్ నెలల్లో దోహాలో ప్రపంచ ఫుట్బాల్ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి దోహాకు వారానికి 20 కొత్త సర్వీసులను ఎయిర్ ఇండియా గురువారం ప్రకటించింది.
అక్టోబర్ 30 నుంచి ఈ విమానాల సేవలు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో ఎయిర్ ఇండియా తెలియజేసింది. కాగా, వారానికి ముంబై నుంచి 13, హైదరాబాద్ నుంచి 4, చెన్నై నుంచి 3 విమాన సర్వీసులు దోహాకు ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి దోహాకు రోజువారీ సర్వీసులు నడుస్తుండగా, వీటికి ఈ కొత్త సర్వీసులు అదనమని ఎయిర్ ఇండియా పేర్కొన్నది