రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది.ఈ ఏడాది ఆరంభం నుంచే నగరంలో ఇండ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి.దేశంలో మరెక్కడా లేనివిధంగా అత్యధిక వృద్ధిరేటు భాగ్యనగరంలో నమోదైనట్టు తాజా సర్వేలో తేటతెల్లమైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: హౌజింగ్ సేల్స్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతున్నది. కరోనా ప్రభావం నుంచి బయటపడ్డ భాగ్యనగర రియల్ ఎస్టేట్ మార్కెట్ వ్యాపారం.. దేశంలోని 6 ఇతర ప్రధాన నగరాలతో పోల్చితే దూసుకుపోతున్నది. ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదికలో హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు గతంతో చూస్తే పెద్ద ఎత్తున పెరిగాయని తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్సహా ఏడు నగరాల్లో జరిగిన హౌజింగ్ సేల్స్ వివరాలను అనరాక్ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 శాతం వృద్ధితో 13,140 యూనిట్ల విక్రయాలు నగరంలో జరిగినట్టు స్పష్టమైంది. నిరుడు జనవరి-మార్చిలో 4,440 యూనిట్ల అమ్మకాలే జరిగాయి. ఈ స్థాయి వృద్ధిరేటు తాజా సర్వేలో పాల్గొన్న ఏ నగరంలోనూ కనిపించకపోవడం గమనార్హం. కాగా, ఈ ఏడు నగరాల్లో నివాస గృహాల సగటు ధరలు గతంతో చూస్తే ఈసారి 2-5 శాతం మేర పెరిగాయని అనరాక్ తెలియజేసింది. హైదరాబాద్లోనే అత్యధికంగా 5 శాతం నమోదైంది. అయినప్పటికీ ఇండ్ల కొనుగోలుకు భారీగా డిమాండ్ ఉండటం విశేషమని అనరాక్ ఈ సందర్భంగా పేర్కొన్నది. ఇక కొత్త ఇండ్ల నిర్మాణాల్లోనూ ఈ 7 నగరాల్లో 43 శాతం వృద్ధి కనిపించింది. నిరుడుతో చూస్తే 62,130 యూనిట్ల నుంచి 89,150 యూనిట్లకు పెరిగాయి.
అనువైన నగరం
వ్యాపార, విద్య, ఉద్యోగావకాశాల్లో అన్ని వర్గాలకు అనువైన నగరంగా హైదరాబాద్ కనిపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని రంగాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా దేశ, విదేశీ సంస్థలు ఇక్కడ పెట్టుబడులకు క్యూ కడుతుండటం.. రియల్ ఎస్టేట్కు ఎక్కడలేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన సైతం భేష్ అని వారు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఆఫీస్, ఇటు రెసిడెన్షియల్ మార్కెట్లలో భాగ్యనగరం పరుగులు పెడుతున్నదని చెప్తున్నారు.
దేశవ్యాప్తంగా 71% పెరుగుదల
హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణె నగరాల్లో అనరాక్ సర్వే జరిగింది. నిరుడుతో చూస్తే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఈ నగరాల్లో ఇండ్ల అమ్మకాలు 71 శాతం ఎగిసి 99,550 యూనిట్లకు చేరాయని అనరాక్ పేర్కొన్నది. 2015 నుంచి గమనిస్తే ఓ త్రైమాసికంలో ఈ స్థాయిలో ఇండ్ల అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని కూడా స్పష్టం చేసింది. నిరుడు జనవరి-మార్చిలో 58,290 యూనిట్ల విక్రయాలు జరిగాయని చెప్పింది. ఇక అక్టోబర్-డిసెంబర్లో 90,860 యూనిట్లుగా ఉన్నాయన్నది. గృహ రుణాలపై చౌక వడ్డీరేట్లు, సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల అందరిలో పెరగడం వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్కు కలిసొచ్చాయని పేర్కొన్నది.
‘రియల్ ఎస్టేట్ మార్కెట్పై కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. త్రైమాసిక ఇండ్ల అమ్మకాలు గడిచిన ఏడేండ్లలోనే గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. ధరలు పెరుగుతున్నా.. డిమాండ్ తగ్గకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. పూర్తయ్యి ఇంకా అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య కూడా సుమారు 2 శాతం తగ్గింది’
-అనుజ్ పురి, అనరాక్ చైర్మన్