న్యూఢిల్లీ, మే 24: హైదరాబాద్సహా దేశంలోని 8 ప్రధాన నగరాల్లో నిరుడుతో పోల్చితే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఇండ్లకు డిమాండ్ పెరిగింది. హౌజింగ్ ధరలు సైతం 11 శాతం వరకు ఎగబాకాయి. నిర్మాణ వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో నివాసయోగ్య ఆస్తులకు కొనుగోలుదారుల నుంచి ఆదరణ పెరగడమే ఇందుకు కారణమని ఓ సంయుక్త నివేదికలో రియల్ ఎస్టేట్ సంస్థలు క్రెడాయ్, కొల్లీర్స్, లియాజెస్ ఫోరాస్ తెలిపాయి. ధరలపరంగా ఈ 8 నగరాల్లో 9 శాతం పెరుగుదలతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నది. ఢిల్లీ-ఎన్సీఆర్ 11 శాతంతో ముందున్నది.
అటు ఇండ్ల ధరల్లోనైనా.. ఇటు ఆ ధరల పెరుగుదలలోనైనా హైదరాబాద్ ఆకట్టుకుంటున్నది. రియల్టర్ల సంఘం క్రెడాయ్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొల్లీర్స్, డాటా అనలిటిక్స్ సంస్థ లియాజెస్ ఫోరాస్ కలిసి విడుదల చేసిన ఈ హౌజింగ్ ప్రైస్-ట్రాకర్ తొలి ఎడిషన్లో కొనుగోలుదారుల్లో భాగ్యనగరానికున్న డిమాండ్ మరోసారి రుజువైంది. నిరుడుతో పోల్చితే చదరపు అడుగు ధరల్లో పెరుగుదలకు సంబంధించి ఢిల్లీ తర్వాత రెండో స్థానంలో ఉండగా, చదరపు అడుగు ధర విషయంలో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ తర్వాత నిలిచింది.
‘పెట్రో ధరలు తగ్గితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాణ రంగానికి ఎంతో ఊరటనివ్వగలదు. అలాగే ఉక్కు, సిమెంట్ తదితర ఉత్పత్తుల ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గడిచిన ఏడాదిన్నర కాలంగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాం’
-హర్షవర్ధన్ పటోడియా, క్రెడాయ్ అధ్యక్షుడు
‘దేశంలోని మొత్తం 8 మెట్రో నగరాల్లో ఇండ్లకు డిమాండ్ కనిపిస్తున్నది. స్టీల్, సిమెంట్ తదితర మెటీరియల్స్ ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం కూడా ఎగిసిపోయింది. కరోనాకు ముందున్న మార్కెట్ ధరలతో పోల్చితే ఇప్పుడు అన్ని నగరాల్లో ఎక్కువగానే రేట్లు పలుకుతున్నాయి’
-రమేశ్ నాయర్, కొల్లీర్స్ ఇండియా సీఈవో
‘ఈ ఏడాది జనవరి-మార్చిలో మళ్లీ దేశవ్యాప్తంగా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ఊపందుకున్నది. రాబోయే రోజుల్లోనూ ఇది కొనసాగగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. గృహ రుణాలపై ఇటీవల పెరిగిన వడ్డీరేట్ల ప్రభావం అమ్మకాలపై ఉండదనే అనుకుంటున్నాను’
-పంకజ్ కపూర్, లియాజెస్ ఫోరాస్ ఎండీ