హైదరాబాద్, మే 10: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ లాభం మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీగా పెరిగింది. 2023 జనవరి-మార్చి మధ్యకాలంలో కంపెనీ నికరలాభం దాదాపు 9 రెట్లు పెరిగి రూ.960 కోట్లకు చేరింది. 2022 మార్చితో ముగిసిన మూడు నెలల్లో రూ.97 కోట్ల లాభం మాత్రమే నమోదు చేసింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో డాక్టర్ రెడ్డీస్ ఆదాయం 15.28 శాతం వృద్ధిచెంది రూ. 5,068.4 కోట్ల నుంచి రూ. 5,843 కోట్లకు చేరింది.
బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 40 చొప్పున డివిడెండ్ సిఫార్సుచేసింది. 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ జెనెరిక్స్ విభాగంలో కంపెనీ ఆదాయం 19 శాతం వృద్ధిచెంది రూ.21,380 కోట్లకు పెరిగింది. ఉత్తర అమెరికా, యూరప్, ఇండియాల్లో వృద్ధి కనపర్చామని, ఇతర వర్థమాన దేశాల్లో అమ్మకాలు ఫ్లాట్గా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ వివరించింది.
‘2023 ఆర్థిక సంవత్సరంలో రికార్డు అమ్మకాలు, లాభాలు, నగదు ఫ్లో సాధించాం. యూఎస్ జెనెరిక్స్ మార్కెట్లో మంచి పనితీరు కనపర్చాం’
-జీవీ ప్రసాద్, కో-చైర్మన్, ఎండీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్