హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ఏటా ఒక్క హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే అమెరికాకు 13 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇలా అమెరికా వెళ్తున్నవారిలో కూడా అత్యధికులు టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరానికే వెళ్తుండటం గమనార్హం. ఇక ప్రస్తుతం 3.4 కోట్ల మంది ప్రతి ఏడాది హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణాలు చేస్తుండగా, 2031 నాటికి ఈ సంఖ్య 5 కోట్లను దాటుతుందన్న అంచనాలున్నాయి.
కొత్తగా పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని జీఎమ్మార్ సంస్థ విమానాశ్రయంలో మరో నూతన టెర్మినల్ను కూడా మనుగడలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, ముఖ్యంగా ప్రపంచ స్థాయి విమానాశ్రయాలకు దీటుగా మలిచేందుకు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్టు ఎయిర్పోర్ట్ సీఈవో ఖదీర్ కదిరవన్ వెల్లడించారు.
ఆయన గురువారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో హైదరాబాద్ ముందున్నదని, బెంగళూరును మించిపోయిందన్నారు. గ్లోబల్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్పోర్ట్ ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే నాలుగో అత్యత్తుమ విమానాశ్రయ అవార్డును కైవసం చేసుకున్నదన్నారు. అలాగే విమానాశ్రయం ద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా భారీగా పెరిగాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నివిధాలుగా కలిపి చూస్తే ఇప్పుడు 4 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారని, 2038 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
రాబోయే కాలంలో విమాన సర్వీసుల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఇప్పటికే పలు విమానయాన సంస్థలు కొత్త విమానాల కోసం ఆర్డర్లు పెట్టాయని, అవి రాబోతున్నాయన్నారు. దేశంలోనే అత్యధిక ప్రైవేట్ విమానాలు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే ఎగురుతున్నాయని, సగటున ప్రతి రోజు పదికి తగ్గకుండా ప్రైవేటు విమానాలు, హెలికాప్టర్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 20కిపైగా ప్రైవేటు విమానాలు/హెలికాప్టర్లు రాకపోకలు సాగిస్తున్నాయని తెలియజేశారు.