ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ ప్రపంచ ఉత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా ఖ్యాతినార్జించిన శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరో ఘనతను సాధించింది. ప్రముఖ ఏవియేషన్ అధ్యయన సంస్థ సీరియం ప్రకటించిన జాబితాలో.. ఆర్జీఐఏ విమాన సమయపాలనలో మొదటిస్థానంలో నిలిచింది.
Shamshabad Airport | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): ఇప్పటికే అనేక విషయాల్లో ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇప్పుడు సమయపాలనలోనూ భేష్ అనిపించుకున్నది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ ప్రపంచ ఉత్తమ ఎయిర్పోర్టుల్లో ఒకటిగా ఖ్యాతినార్జించిన శంషాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (ఆర్జీఐఏ).. సమయానికి రాకపోకలు జరిగే ఎయిర్పోర్టులకు సంబంధించి విడుదలైన తాజా జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఏవియేషన్, ట్రావె లింగ్ అధ్యయన సంస్థ సీరియం ఈ ఏడాది మార్చికిగాను ఇచ్చిన నివేదికలో సమయపాలన పాటిస్తున్న ఎయిర్పోర్టుల్లో ఆర్జీఐఏ మొదటి స్థానాన్ని దక్కించుకున్నది. మార్చి నెలలో 90 శాతం విమానాలు ఆన్టైమ్లో గమ్యస్థానాలకు చేరుకున్నట్టుగా తేలింది. ఎయిర్పోర్టు నుంచి జరిగిన రాకపోకల్లో డిపార్చర్ పరంగా ఆన్టైమ్ పెర్ఫార్మెన్స్ (ఓటీపీ) 90.43 శాతంగా నమోదైంది. ఈ స్థాయిలో గణాంకాలు మరే ఎయిర్పోర్టుకూ లేకపోవడం గమనార్హం.
50 లక్షల విమానాలపై సమీక్ష..
ప్రపంచవ్యాప్తంగా మార్చి నెలలో 50 లక్షల విమానాల రాకపోకలను సమీక్షించి ఈ నివేదికను సిద్ధం చేసింది సీరియం సంస్థ. అయితే సమయపాలనలో ఎప్పుడూ ముందుండే జపాన్ ఎయిర్పోర్టులను అధిగమించి తొలిసారి ఓ భారతీయ ఎయిర్పోర్ట్ నిలిచింది. ఈ ఘనత హైదరాబాద్ ఎయిర్పోర్టుకు దక్కడం విశేషమవగా, ఇక్కడి మౌలిక సదుపాయాల కల్పనకు ఇది అద్దం పడుతున్నది. ఇక గ్లోబల్ ఎయిర్పోర్ట్, లార్జ్ ఎయిర్పోర్ట్ విభాగాల్లోనూ ఆర్జీఐఏ సత్తా చాటుతూ నంబర్ 1లో స్థిరపడింది. కాగా, గత ఏడాది నవంబర్లో వచ్చిన రిపోర్టులో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఓటీపీ 88.44 శాతంగా ఉన్నది. అప్పుడు నాల్గో స్థానంలో ఉన్నది.
ఆధునిక సాంకేతికతతో..
దేశంలోని విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మొదట్నుంచీ ప్రత్యేక గుర్తింపే ఉన్నది. ఆధునిక సాంకేతికత వినియోగంలో ముందుంటూ అందర్నీ ఆకర్షిస్తూనే ఉంది. దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సెంట్రలైజ్డ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ (ఏఓసీసీ), ఆధునిక ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు, ఎక్స్ప్రెస్ సెక్యూరిటీ చెక్-ఇన్, సెల్ఫ్ చెకిన్ కియోస్లు, ఈ-బోర్డింగ్, వీడియో అనలిటిక్స్ వంటి నయా టెక్నాలజీలు ఇక్కడి శంషాబాద్ ఎయిర్పోర్టు సొంతం. ఇవన్నీ కూడా ఆన్టైమ్ పెర్ఫార్మెన్స్ను (ఓటీపీ) ప్రభావితం చేసే అంశాలేనని ఎయిర్పోర్టు వర్గాలు పేర్కొన్నాయి. ఇక ఈ జాబితాలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్నది. 86.14 శాతం డిపార్చర్ ఓటీపీతో రెండో స్థానం పొందింది. కాగా, మార్చిలో దేశ, విదేశాల్లోని 77 రూట్లలో హైదరాబాద్ నుంచి 14,658 విమానాల రాకపోకలు జరిగాయి.
‘ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన ఎయిర్పోర్టుగా గుర్తింపు రావడం సంతోషంగా ఉన్నది. కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం, ప్రయాణీకులకు మెరుగైన సేవలను అందించడానికే పెద్దపీట వేయడం కలిసొచ్చింది’
-ప్రదీప్ పణికర్, జీఎమ్మార్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సీఈవో