న్యూయార్క్ : ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీల వరకూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, సిస్కో సహా వివిధ కంపెనీలు భారీ లేఆఫ్స్ను ప్రకటిస్తున్నాయి. తాజాగా పీసీ తయారీ దిగ్గజం హెచ్పీ సైతం లేఆఫ్స్ ప్రణాళికలను వెల్లడించింది. 2025 ఆర్ధిక సంవత్సరం వరకూ పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు హెచ్పీ సన్నాహాలు చేపట్టింది.
ఆర్ధిక ఫలితాల అనంతరం కంపెనీ లేఆఫ్స్ తప్పవనే సంకేతాలు పంపింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో పనిచేసే 12 శాతం మంది ఉద్యోగులు అంటే దాదాపు 6000 మంది ఉద్యోగులపై హెచ్పీ వేటు వేయనుంది. పీసీ సేల్స్ పడిపోవడం, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్న నేపధ్యంలో కంపెనీ సీఎఫ్ఓ మారీ మీర్స్ జాబ్ కట్స్ తప్పవనే సంకేతాలు పంపారు. ఈ ఏడాది ఎదురైన సవాళ్లు వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగుతాయని అన్నారు.
హెచ్పీలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50000 మంది పనిచేస్తుండగా పునర్వ్యవస్ధీకరణలో 4000 నుంచి 6000 మంది వరకూ ఉద్యోగులపై వేటు తప్పదని భావిస్తున్నారు. రాబోయే కొన్నేండ్లలో తాము చేపట్టే పునర్వ్యవస్ధీకరణలో 6000 కొలువుల కోత ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఉద్యోగాలు కోల్పోయే వారికి తాము వెన్నంటి ఉంటామని, వారు మరో అవకాశం పొందేలా ఆర్ధికంగా, కెరీర్ సేవల పరంగా సాయం చేస్తామని హెచ్పీ తెలిపింది.