క్రిప్టో కరెన్సీల్లో మదుపు లేదా ట్రేడింగ్కు సంబంధించి ఈ నెల 1 నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్రిప్టో అకౌంట్లకు నగదు
బదిలీలపై ఒక శాతం టీడీఎస్, లాభాలపై 30 శాతం పన్ను, నష్టాలను ఇతర అసెట్లలో వచ్చిన లాభాలతో అడ్జస్ట్మెంట్కు వీల్లేకుండా చేయడం వల్ల ఇక నుంచి క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్ ఎలా? అనే సందేహాలు మొదలయ్యాయి. మరోవైపు క్రిప్టో ఎక్సేంజీల అడ్వైర్టెజ్మెంట్లు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల మధ్య తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం..
అవగాహనతోనే..: ఎందులో మదుపు చేయాలనుకున్నాసరే.. ఆయా మదుపు సాధనాలపై పూర్తి అవగాహన అవసరం. వాటి లాభనష్టాలను బేరిజు వేసుకున్న తర్వాతనే మదుపు నిర్ణయాన్ని తీసుకోవాలి. క్రిప్టో కరెన్సీలలో మదుపు చేసే ముందు అవి ఎలా?.. ఏ టెక్నాలజీతో పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. లేకపోతే వాటి సలహాదారును సంప్రదించండి.
విచక్షణతో..: క్రిప్టో కరెన్సీ ఫండమెంటల్స్ మీకు పూర్తిగా అర్థం అయ్యాయని అనుకుందాం. అయినాసరే విచక్షణ లేకుండా మదుపు చేయకండి. భారత్లో నేరుగా నిషేధించకపోయినా.. దానికి సమానంగా పన్నులు విధించారు. అందుకని అధిక మొత్తాలను మదుపు చేయకండి. రిస్క్లూ అధికమే.
దీర్ఘకాలానికి..: ఒక శాతం టీడీఎస్తో క్రిప్టో ట్రేడింగ్ను ఆదిలోనే నిరుత్సాహపరిచారు. దీంతో అతి స్వల్పకాలంలో రాబడులను సాధించడం అసాధ్యం. అయితే భవిష్యత్తు క్రిప్టో కరెన్సీ కదలికలపై, రాబడులపై నమ్మకం ఉంటే దీర్ఘకాలానికి కొంత మొత్తాన్ని కేటాయించవచ్చు.
హోల్డింగ్ ఎక్కడ: క్రిప్టో పూర్తిగా టెక్నాలజీమయం. మీరు కొనుగోలు చేసిన క్రిప్టో టోకెన్ హోల్డింగ్ ఎక్కడ ఉందో తెలుసుకోవాల్సిందే. లేదంటే గాలిలో దీపం పెట్టినట్టే. క్రిప్టోలను దాచే వ్యాలెట్లు, హార్డ్వేర్ల గురించి కూడా అవగాహన ఉండాలి. సెల్ఫ్ హోస్టెడ్, నాన్ కస్టోడియల్ వ్యాలెట్లు సురక్షితం. డిజిటల్ అసెట్లకు బ్యాకప్ తప్పనిసరి.
పన్ను ఎగవేత కుదరదు: కొత్త నిబంధనలతో పన్ను ఎగవేత కుదరదు. ఐటీ శాఖ కన్నుగప్పి క్రిప్టోలలో ట్రేడింగ్ చేయాలనుకోవడం భ్రమ. ఐటీ నుంచి నోటీసులు వచ్చే పరిస్థితి తెచ్చుకోకండి. అలాగే మీ నగదు బదిలీలను, రాబడులను ఐటీ కన్సల్టెంట్లకు స్పష్టంగా తెలియజేయండి.