డిపాజిట్దారులకు బ్యాంక్లు శుభవార్తను అందిస్తున్నాయి. వరుసగా మూడు పరపతి సమీక్షల్లో రిజర్వు బ్యాంక్ వడ్డీరేటును 1.40 శాతం పెంచడంతో బ్యాంకులు రుణాలతోపాటు తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను క్రమంగా పెంచుతున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్డీలపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు పెంచగా..మిగతా బ్యాంక్లు కూడా ఇదే దారి పట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు ఎఫ్డీలపై వడ్డీరేటును స్వల్పంగా పెంచగా..అదే ప్రైవేట్ బ్యాంక్లు మాత్రం ఎక్కువ పెంచాయి. డిపాజిట్దారులకు అత్యధిక వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. వీటి వివరాలు సంక్షిప్తంగా..
ఫిక్స్డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లను పెంచింది ఎస్బీఐ. రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్డీలపై మాత్రమే ఈ వడ్డీ పెంపు వర్తిస్తుంది. 180 రోజుల నుంచి 210 రోజుల డిపాజిట్లపై వడ్డీరేటును 4.55 శాతంగాను, ఏడాది-రెండేండ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని కూడా 5.30 శాతం నుంచి 5.45 శాతానికి, రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీని 5.50 శాతానికి, మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు వడ్డీరేటును 5.60 శాతానికి పెంచింది. దీంతోపాటు 5 నుంచి 10 ఏండ్లలోపు డిపాజిట్లపై బ్యాంక్ 5.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన డిపాజిట్లపై వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఏడాది నుంచి రెండేండ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని బ్యాంక్ 5.35 శాతం నుంచి 5.50 శాతానికి పెంచింది. అలాగే రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు వడ్డీని 5.50 శాతం, మూడేండ్ల నుంచి ఐదేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీని 40 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీరేటు 6.10 శాతానికి చేరుకున్నది.
కొటక్ మహీంద్రా బ్యాంక్..
రూ.2 కోట్ల లోపు ఏడాది నుంచి మూడేండ్లలోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు అధికం చేసింది కొటక్ మహీంద్రా బ్యాంక్. దీంతో వడ్డీరేటు 5.60 శాతం నుంచి 5.75 శాతానికి చేరుకున్నది. అలాగే 390 రోజుల నుంచి మూడేండ్లలోపు మెచ్యూరిటీ కలిగిన ఎఫ్డీలపై వడ్డీరేటు కూడా 5.75 శాతం నుంచి 5.90 శాతానికి సవరించింది. అలాగే మూడేండ్ల నుంచి పదేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో వడ్డీరేటు 5.90 శాతంగా కొనసాగనున్నది.
పీఎన్బీ..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీని 20 బేసిస్ పాయింట్లు అధికం చేసింది. పలు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది.