Homes | కరోనా మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా సొంతిండ్ల కొనుగోళ్లు పెరిగాయి.. రవాణా ఖర్చులు.. ఇన్పుట్ కాస్ట్.. ఇతర వ్యయాలు ఎక్కువ కావడంతో ఇండ్ల ధరలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అయినా ఇండ్ల కొనుగోళ్లు దూకుడుగానే సాగుతున్నాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు సగటున ఎనిమిది శాతం పెరిగాయని ఇండస్ట్రీ బాడీ ‘కెడాయ్’, రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ కొల్లియర్ లియాసెస్ ఫొరాస్ సంయుక్త నివేదిక తెలిపింది. రుణాలపై వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతుండటంతో ఇండ్ల కొనుగోలు దారుల్లో పాజిటివ్ సెంటిమెంట్ కొనసాగుతున్నదని ఆ నివేదిక స్పష్టం చేసింది.
దేశంలోకెల్లా అత్యధికంగా కోల్కతాలో 2022తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 15 శాతం ధరలు పెరిగాయి. 21 నెలలుగా నికరంగా పెరుగుతున్నాయి. రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గింపు, 10 శాతం సర్కిల్ రేట్ తగ్గింపు కొనసాగించడం కూడా ఇండ్ల ధరల పెరుగుదలకు కారణం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్కిల్ రేట్ 10 శాతం, స్టాంప్ డ్యూటీ రెండు శాతం తగ్గింపు వచ్చే సెప్టెంబర్ వరకూ కొనసాగుతాయి.
ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో 14 శాతం ధరలు పెరిగాయి. హైదరాబాద్ నగర పరిధిలో ఇండ్ల ధరల్లో 13 శాతం గ్రోత్ నమోదైంది. ఢిల్లీలోని గల్ఫ్ కోర్స్ రోడ్డు పరిధిలో 46 శాతం, ద్వారక ఎక్స్ప్రెస్ వే పరిధిలో 40 శాతం ఇండ్ల ధరలు పెరిగాయి. గురుగ్రామ్ పరిధిలో కమర్షియల్ ఆఫీస్ హబ్లకు రెసిడెన్షియల్ ఏరియాలకు కనెక్టివిటీ పెరగడంతో ఇండ్లకు గిరాకీ పెరిగిందని క్రెడాయ్-కొల్లియర్ లియాసెస్ ఫొరాస్ నివేదిక పేర్కొంది. బెంగళూరులో 10 శాతం ధరలు పెరిగాయి. చెన్నైలో ఆరు శాతం, పుణెలో 11 శాతం పెరిగితే ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో మూడు శాతం ధరలు తగ్గాయి.