న్యూఢిల్లీ, మే 7: దేశంలో గృహస్తుల పొదుపు మందగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాతి నుంచి ఏటా క్షీణిస్తూనే ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే 2022-23లో రూ.14.16 లక్షల కోట్లకే నికర సేవింగ్స్ పరిమితమైయ్యాయి. 2020-21లో గరిష్ఠంగా రూ.23.29 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో నాటితో పోల్చితే రూ.9.13 లక్షల కోట్లు క్షీణించినైట్టెంది. 2021-22లోనూ రూ.17.12 లక్షల కోట్లకు దిగజారగా.. అప్పటితో చూసినా ఐదేండ్ల కనిష్ఠానికి పతనమైనట్టు తేలింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యాచరణ అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ పద్దు గణాంకాలు-2024 వివరాలు చెప్తున్నాయి. ఇక 2017-18లో దేశీయ నెట్ హౌస్హోల్డ్ సేవింగ్స్ తక్కువగా రూ.13.05 లక్షల కోట్లుగా ఉన్నాయి. అయితే 2018-19 లో రూ.14.92 లక్షల కోట్లకు, 2019-20లో రూ.15.49 లక్షల కోట్లకు పెరిగాయి.
2020-21తో పోల్చితే 2022-23లో గృహస్తుల రుణ భారం కూడా రెట్టింపైంది. నాడు రూ.6.05 లక్షల కోట్లుగానే ఉన్నది. అయితే 2021-22లో రూ.7.69 లక్షల కోట్లకు, 2022-23లో రూ.11.88 లక్షల కోట్లకు గృహస్తుల రుణ భారం పెరిగింది. కాగా, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) ద్వారా తీసుకున్న రుణాలు కూడా పెరిగాయి. 2022-23లో ఏకంగా రూ.3.33 లక్షల కోట్లను తాకాయి. 2020-21లో రూ.93,723 కోట్లుగానే ఉన్నాయి. 2021-22లో మాత్రం రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నట్టు తాజా గణాంకాల ద్వారా స్పష్టమైంది.
మ్యూచువల్ ఫండ్స్ల్లో గృహస్తుల పెట్టుబడులు 2022-23లో రూ.1.79 లక్షల కోట్లకు చేరాయి. 2020-21లో రూ.64,084 కోట్లే. 2021-22లో రూ.1.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. అలాగే షేర్లలో, డిబెంచర్లలోనూ పెరిగాయి. 2022-23లో రూ.2.06 లక్షల కోట్లుగా ఉన్నట్టు తేలింది. 2020-21లో రూ.1.07 లక్షల కోట్లే. 2021-22లో మాత్రం రూ.2.14 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మొత్తంగా 2020-21 నుంచి దేశంలోని గృహస్తుల పొదుపు తగ్గి, రుణ భారం పెరిగినట్టు స్పష్టమవుతున్నది. ముఖ్యంగా కరోనా ప్రభావం మాత్రం దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై పెద్దగానే పడినట్టు కనిపిస్తున్నది. మహమ్మారి దెబ్బకు తలకిందులైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటూ ఊదరగొట్టిన కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ తాజా లెక్కలు మాత్రం నిలువుటద్దంలా నిలుస్తున్నాయి.