Honda EV 2 Wheelers | మున్ముందు అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్దే రాజ్యం.. దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఆ బాటలోనే పయనిస్తున్నాయి. దేశంలోని రెండో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) కూడా ఆ రూట్లోకి వచ్చేసింది. ఎంట్రీ లెవెల్ స్కూటర్ను మార్కెట్లోకి తేవడానికి ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్టీవా కంటే చౌకగా కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నది. హోండా ఈవీ స్కూటర్ లేదా బైక్ ప్రస్తుతం డెవలపింగ్ దశలో ఉందని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా అధ్యక్షుడు అతుషి ఒగాటా చెప్పారు. అయితే, ఎప్పుడు మార్కెట్లో ఆవిష్కరిస్తారన్న సంగతిగానీ, సదరు ఈవీ స్కూటర్ వివరాలు గానీ బయట పెట్టలేదు. పలు మోడల్స్ పరిశీలనలో ఉన్నాయని, అయితే, 2030 నాటికి పది లక్షల ఈవీ టూవీలర్స్ విక్రయిస్తామని అతుషి ఒగాటా తెలిపారు.
తొలుత హోండా విడుదల చేసే `ఈవీ టూ వీలర్` గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. హోండా యాక్టీవా ధర రూ.72 వేల నుంచి రూ.75 వేల మధ్య తచ్చాడుతున్నది. దీని కంటే తక్కువ ధరకే అందిస్తామని అతుషి ఒగాటా తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో హోండా ఈవీ టూ వీలర్.. రోడ్ల మీదకు దూసుకొస్తుందన్నారు. చౌకగా వినియోగదారులకు అందుబాటులో ఉండే మిడ్ రేంజ్ టూ వీలర్గా ఉంటుందన్నారు. ఎలక్ట్రిక్ టూవీలర్స్ కోసం ఎదురు చూస్తున్న వారిని ఆకర్షించడమే లక్ష్యంగా ఈవీ టూ వీలర్స్ తయారు చేస్తామన్నారు. అంతే కాదు, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉత్పత్తికి ఒక ప్రొడక్షన్ యూనిట్ను ప్రత్యేకంగా కేటాయించే పనిలో ఉన్నామని చెప్పారు.
ప్రస్తుతం హర్యానాలోని మనేసర్, రాజస్థాన్లోని తపుకరా, కర్ణాటకలోని నర్సాపుర, గుజరాత్లోని విథలాపూర్ యూనిట్లలో హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్లు తయారవుతున్నాయి. హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ కంపెనీ, ఓలా ఎలక్ట్రిక్ వంటి స్టార్టప్ సంస్థలు ఎలక్ట్రిక్ టూ వీలర్స్లోకి ఎంటరైన నేపథ్యంలో హోండా మోటార్స్ అండ్ సైకిల్స్ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.