హైదరాబాద్, మార్చి 10: ప్రతికూల పరిస్థితుల్లోనూ హైదరాబాద్లో ఇండ్ల అమ్మకాలు ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరిలో 5,146 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా గురువారం తెలియజేసింది. వీటి విలువ రూ.2,722 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నది. దాదాపు 74 శాతం అమ్మకాలు 1,000-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోనివే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే హైదరాబాదీలు విశాలమైన ఇండ్లవైపు చూస్తున్నారని ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది. గత నెలలో హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల లావాదేవీలను నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా వెల్లడించింది.
శివారు ప్రాంతాలదే హవా
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున విస్తరిస్తున్నాయి. ఎక్కువ మంది ఇక్కడే సొంతిల్లును కోరుకుంటుండటమే ఇందుకు కారణం. నైట్ ఫ్రాంక్ ఇండియా తెలియజేసిన తాజా వివరాల్లోనూ ఇదే స్పష్టమవుతున్నది. గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ జిల్లాలో అమ్మకాలు 20 శాతంగా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 శాతానికి తగ్గాయి. అయితే మేడ్చల్-మల్కాజ్గిరిలో విక్రయాలు 39 శాతం నుంచి 42 శాతానికి, రంగారెడ్డిలో 37 శాతం నుంచి 43 శాతానికి ఎగబాకాయి. సంగారెడ్డిలోనూ 4 శాతం నుంచి 5 శాతానికి ఎగిశాయి. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
పెరిగిన ధరలు
గడిచిన ఏడాది కాలంలో సగటు లావాదేవీ ధరలూ పెరిగాయి. హైదరాబాద్లో సగటున ఒక్క చదరపు అడుగు ఈ ఫిబ్రవరిలో రూ.4,048 పలికింది. దీంతో నిరుడు ఫిబ్రవరితో చూస్తే 19 శాతం ఎగిసినైట్టెంది. మేడ్చల్-మల్కాజ్గిరిలో 28 శాతం వృద్ధితో రూ.2,872గా ఉన్నది. అలాగే రంగారెడ్డిలో రూ.4,368, సంగారెడ్డిలో రూ.2,484గా ఉన్నాయి. గతంతో పోల్చితే ఇక్కడ 20 శాతం, 36 శాతం పెరిగాయి.
రూ.50 లక్షలలోపు..
రూ.50 లక్షలలోపు ఇండ్లకు డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా రూ.25-50 లక్షల విలువైన నివాసాలకు మార్కెట్లో ఆదరణ ఆకర్షణీయంగా ఉందని నైట్ఫ్రాంక్ ఇండియా చెప్తున్నది. నిరుడు ఫిబ్రవరిలో రూ.25 లక్షల దిగువన ఉన్న ఇండ్లకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ వ్యక్తమైందని, అయితే ఈసారి అది 42 శాతం నుంచి 16 శాతానికి పడిపోయిందని తాజా గణాంకాల్లో తేలింది. ఇదే సమయంలో రూ.25-50 లక్షల విలువైన నివాసాల విక్రయాలు 34 శాతం నుంచి 52 శాతానికి ఎగిశాయి. అలాగే గతంతో చూస్తే రూ.50-75 లక్షల విలువైన నివాసాల డిమాండ్ 11 శాతం నుంచి 14 శాతానికి, రూ.75 లక్షలు-కోటి రూపాయల విలువైన నివాసాల డిమాండ్ 7 శాతం నుంచి 9 శాతానికి ఎగిసింది. కోటి రూపాయలు-రూ.2 కోట్ల విలువైన గృహాలకూ డిమాండ్ 5 శాతం నుంచి 7 శాతానికి పెరగడం విశేషం. ఇక రూ.2 కోట్లకుపైగా విలువైన నివాసాల డిమాండ్ 2 శాతంతో స్థిరంగా ఉన్నది.
కొత్త ప్రాజెక్టులకు గిరాకీ
హైదరాబాద్లో కొత్త ప్రాజెక్టులకు బాగా గిరాకీ ఉన్నదని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వెల్లడించింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో హైదరాబాద్లోనే ఎక్కువగా కొత్త ప్రాజెక్టుల్లోని ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని పేర్కొన్నది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, పుణె, కోల్కతా, బెంగళూరు, చెన్నైల్లో అనరాక్ సర్వే చేసింది. దీని ప్రకారం 2021లో ఈ నగరాల్లో జరిగిన విక్రయాల్లో దాదాపు 35 శాతం కొత్తవే. మొత్తం 2.37 లక్షల యూనిట్లు అమ్ముడైతే అందులో 80వేలు కొత్త ప్రాజెక్టులవేనని తేలింది. ఇందులో హైదరాబాద్ వాటానే అత్యధికంగా 25,410 యూనిట్లుగా ఉన్నట్టు అనరాక్ చైర్మన్ అనూజ్ పురి తెలిపారు. అలాగే గతేడాది దాదాపు 55 శాతం కొత్త ప్రాజెక్టులు భాగ్యనగరంలో వచ్చినట్టు పేర్కొన్నారు.
‘గడిచిన కొన్నేండ్లుగా అమ్మకపు ధర ఆధారంగా దేశంలోని బలమైన రెసిడెన్షియల్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉంటున్నది. అయితే ఒమిక్రాన్ వైరస్, ఇతరత్రా కారణాలతో విక్రయాలు ఈ ఏడాది తొలి రెండు నెలల్లో కాస్త నిరాశపరిచాయి. అయినప్పటికీ ఇతర నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో ఇండ్ల డిమాండ్ ఆకర్షణీయంగానే ఉండటం విశేషం’
-శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ