Demand for Homes | కరోనా మహమ్మారి రాకతో రియల్ ఎస్టేట్.. ప్రత్యేకించి సొంతింటి కొనుగోళ్లు పెరిగాయి. రోజురోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. గతేడాది వెలుగు చూసిన కరోనాతో ఇండ్ల ధరలు స్థిరంగా సాగినా.. ఈ ఏడాది క్రమంగా పుంజుకున్నాయి.క్రమంగా పుంజుకుంటున్న గిరాకీకి అనుగుణంగా వచ్చే ఏడాది ఇండ్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయని ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ చెబుతోంది. విశాలమైన ఇండ్లు, మెరుగైన వసతులు కావాలన్న కొనుగోలుదారుల ప్రియారిటీస్కు తోడు ధరలు ఆకర్షణీయంగా ఉండటంతో నివాస ఇండ్ల విక్రయాలు పుంజుకుంటున్నాయని 2022 ఔట్లుక్ రిపోర్ట్ బయటపెట్టింది. వచ్చే 12 నెలల్లో ఇండ్ల ధరలు పెరుగుతాయని నైట్ఫ్రాంక్ హోంబయ్యర్స్ సర్వే -2021 వెల్లడించింది. అంతేకాదు కరోనా తర్వాత నెలకొంటున్న న్యూ నార్మల్ పరిస్థితుల్లో ఆఫీస్ స్పేస్ను కో వర్కింగ్ మోడల్ డామినేట్ చేయబోతున్నది.
గత దశాబ్దిలో పాత పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రెరా చట్టంతో కుదేలైన రియాల్టీ రంగం కోలుకుంటున్న దశలో గతేడాది విశ్వరూపం ప్రదర్శించిన కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. 2011-21 మధ్య సప్లయ్, డిమాండ్ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇండ్ల ధరలపై ఒత్తిడి పెరుగుతుందని ఆ రిపోర్ట్ పేర్కొంది. కనుక 2022లో ఇండ్ల ధరలు ఐదు శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు వివరించింది.
కరోనా మహమ్మారి తర్వాత న్యూనార్మల్ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఫ్లెక్సిబుల్ ఆఫీస్ స్పేస్కోసం డిమాండ్ పెరుగుతున్నది. ఆఫీస్ స్పేస్లో కో-వర్కింగ్ సంస్కృతి అమల్లోకి రాబోతున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఐటీ, దాని అనుబంధ సంస్థల్లో హైబ్రీడ్ వర్కింగ్ స్టైల్ డామినేట్ చేయబోతున్నదని తెలుస్తున్నది.
2019లో సగటున ఐటీ రంగ సంస్థల ఆఫీస్ స్పేస్ సగటున 70 లక్షల చదరపు అడుగులైతే.. మిగతా సంస్థలు 1.5 కోట్ల చదరపు అడుగులు. కానీ 2020 లాక్డౌన్ వేళ అది 20 లక్షల ఎస్ఎఫ్టీలకు కుదించుకుపోయింది. తిరిగి 2021 తొలి త్రైమాసికం నుంచి మూడో త్రైమాసికానికి 80 లక్షల ఎస్ఎఫ్టీకి తిరిగి చేరుకున్నది. కుష్మన్ అండ్ వాక్ఫీల్డ్ రిపోర్ట్ ప్రకారం 2022లో హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరుగుతుందని అంచనా.
ప్రస్తుతం ప్రధాన అంతర్జాతీయ సంస్థాగత ఇన్వెస్టర్లతో కలిసి పని చేస్తున్న లీడింగ్ రియాల్టీ కన్సల్టింగ్ ఫర్మ్ సీబీఆర్ఈ సౌత్ ఏషియా రియాల్టీ రంగంలో ప్రతియేటా 25 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. కరోనాతో 2020 నుంచి ఇప్పటి వరకు 100కి పైగా కార్యాలయాలను మూసేసింది ఈ సంస్థ. అయితే కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా రిటైల్, లాండ్, గోదాములు, డేటా సెంటర్లు, హెల్త్కేర్, విద్య తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మదుపర్లు ఆసక్తి చూపుతున్నారని సీబీఆర్ఈ సౌత్ ఏషియా క్యాపిటల్ మార్కెట్స్ ప్రతినిధి నిఖిల్ భాటియా చెప్పారు. రియాల్టీ రంగంలో భారీగా పెట్టుబడులు పెరుగనున్నాయని అన్నారు.