న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నవారికి సైతం గృహ రుణాల వడ్డీరేటుపై రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. తక్కువ క్రెడిట్ స్కోర్ (151-200) కలిగిన వారితోపాటు క్రెడిట్ స్కోర్ లేని వారికి కూడా 65 బేసిస్ పాయింట్లు, 45 బేసిస్ పాయింట్ల డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంతోపాటు 750 కంటే అధిక స్కోర్ కలిగిన వారికి కూడా 55 బేసిస్ పాయింట్లు రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే.
వీరికి 8.60 శాతం వడ్డీకి గృహ రుణాన్ని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. నాలుగు నెలలపాటు అందుబాటులో ఉండనున్న ఈ ప్రత్యేక క్యాంపెన్ డిసెంబర్ 31న ముగియనున్నది. 700 నుంచి 749 క్రెడిట్ స్కోర్తోపాటు 151 నుంచి 200 లోపు స్కోర్ కలిగిన ఖాతాదారులకు వడ్డీరేటును 9.35 శాతం నుంచి 8.70 శాతానికి దించింది. 750 కంటే అధిక స్కోర్ కలిగిన వారికి 8.40 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..700-749 లోపు వారికి 8.50 శాతం విధిస్తున్నది. జూన్తో ముగిసేనాటికి బ్యాంక్ గృహ రుణాల పోర్ట్ఫోలియో 13. 47 శాతం పెరిగి రూ.6,52,548 కోట్లకు చేరుకున్నాయి.