Home Loan EMI may Dearer | రోజురోజుకు పెరిగిపోతున్న ధరలతో చారిత్రక కనిష్ట స్థాయికి వడ్డీరేట్ల హవా ముగిసినట్లేనని తెలుస్తున్నది. ధరల ప్రభావాన్ని నియంత్రించడానికి ఇటీవల రెపోరేట్ 40 బేసిక్ పాయింట్లు పెంచడం ద్వారా మున్ముందు మరింత పెరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంకేతాలిచ్చారు. గత కొన్ని నెలలుగా హోల్సేల్ ద్రవ్యోల్బణం రెండంకెల్లో సాగుతుంటే, చిల్లర ద్రవ్యోల్బణం కూడా 2-6 శాతం కంటే ఎక్కువే నమోదవుతున్నది. చిల్లర ద్రవ్యోల్బణం.. వడ్డీరేట్లను ఖరారు చేసేందుకు ఆర్బీఐకి సౌకర్యవంతమైన వెసులుబాటు కల్పిస్తుంది.
కరోనా మహమ్మారిని నియంత్రించడానికి 2020 నుంచి కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ 1.25 శాతం తగ్గించేసింది. నిరవధిక లాక్డౌన్వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఇటీవలి వరకు వడ్డీరేట్లను చారిత్రక కనిష్ఠ స్థాయినే కొనసాగిస్తూ వచ్చింది. ఒకవేళ కరోనాకు ముందు నాటి స్థాయి వడ్డీరేట్లు పెరిగితే.. ఇండ్ల రుణాలపై రుణ గ్రహీతల నెలసరి వాయిదాల చెల్లింపులు 10 శాతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 1.25 శాతం పెంచేసిందనుకుందాం. 20 ఏండ్ల గడువుకు 6.75 శాతం వడ్డీపై 30 లక్షల వడ్డీ తీసుకున్నారా.. అయితే, 1.25 శాతం వడ్డీ పెరిగితే నెలసరి వాయిదా రూ.22,811 నుంచి రూ.25,093కి పెరుగుతుంది. ఫ్లోటింగ్ వడ్డీరేట్లపై రుణాలు తీసుకున్న అత్యధిక రుణ గ్రహీతలపై ప్రభావం పడుతుంది.
గత రెండు నెలలుగా ఇండ్ల రుణాలపై పలు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీరేట్లు పెంచేశాయి. జూన్ ఒకటో తేదీ నుంచి ఎస్బీఐ తన ఈబీఆర్, ఇంటి రుణంపై ఆర్ఎల్ఎల్ఆర్ (రెపో లింక్డ్ లోన్ రేట్) 0.4 శాతం పెంచేసింది. హెచ్డీఎఫ్సీ కూడా ఫ్లోటింగ్ వడ్డీరేటు 0.35 శాతం పెంచింది.
పలు ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు రెపోరేట్కు అనుగుణంగా పెరుగుతాయి. అప్పుడు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ రేట్ (ఈబీఆర్) నెలసరి వాయిదా పెరుగుతుంది. రెపోరేట్ పెరిగితే ఫ్లోటింగ్ వడ్డీరేటుపై రుణాలు తీసుకున్న వారికి తదుపరి రీసెట్ తేదీ నుంచి కొత్త ఈబీఆర్ అమలవుతుంది. దాదాపు బ్యాంకులన్నీ ప్రతి మూడు నెలలకోసారి తమ ఈబీఆర్ మార్చేయాల్సిన అవసరం ఉంటుంది.