Home Loans | ధరలను కంట్రోల్ చేయడానికి ఏడాది కాలంగా ఆర్బీఐ రెపోరేట్.. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. వడ్డీ పెరుగుదలతో ఇండ్ల రుణాలు కాస్ట్లీగా మారుతున్నాయి. కానీ, రుణాలతో ఇల్లు సొంతం చేసుకోవాలని తలపోస్తున్న వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 2022తో పోలిస్తే గత జనవరి-మార్చి మధ్య కాలంలో ఇండ్ల రుణాల్లో 42 శాతం వృద్ధి నమోదైందని ప్రముఖ రియాల్టీ సంస్థ ‘నో బ్రోకర్’ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే మాత్రం 42 శాతం, గతేడాది 2021-22 మార్చి త్రైమాసికంతో పోలిస్తే 120 శాతం గ్రోత్ నమోదైంది. సొంతిండ్లకు ప్రాధాన్యం ఇస్తున్న వారిలో మిలియనిల్స్ ఎక్కువగా ఉంటున్నారు. 27 శాతం మంది ఇండ్ల కొనుగోలు దారుల్లో 25-35 ఏండ్ల మధ్య వయస్సు గల వారే.. కొవిడ్-19 మహమ్మారికి ముందుతో పోలిస్తే 17 శాతం ఎక్కువగా కుర్రాళ్లు సొంతింటి కొనుగోలుకే మొగ్గుతున్నారు.
సొంతింటి కల నిజం చేసుకోవాలని భావిస్తున్న వారు డౌన్ పేమెంట్ కోసం పర్సనల్ లోన్ తీసుకుని మరీ ఇండ్ల రుణాలు తీసుకుంటున్నారు. తమకు నచ్చిన ఇల్లు సొంతం చేసుకోవడానికి, నిర్మించుకోవడానికి అవసరమైన రుణం తీసుకోవడానికి పలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) ఇచ్చే ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. 78 శాతం మంది ప్రజానీకం ఇండ్ల కొనుగోళ్లు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని గానీ, చాలా చౌక అని గానీ చెప్పడం లేదు.
రుణాలపై ఇండ్లు కొనుగోలు చేసేవారు ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపుతో పెరిగే రుణ భారంపై వాస్తవిక పరిస్థితుల గురించి అవగాహన కలిగి ఉన్నారు. గత 10-12 ఏండ్ల నుంచి పరిశీలిస్తే గత దశాబ్ధ కాలంలో రెపోరేట్ 6-8 శాతం మధ్యే ఉందని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే ఆర్బీఐ రెపోరేట్ నాలుగు శాతం నుంచి 6.5 శాతానికి పెరిగింది. తదనుగుణంగా బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయి.
ఇండ్ల రుణాలు సాధారణంగా 20 ఏండ్ల టెన్యూర్ కలిగి ఉంటాయి. 20 ఏండ్ల కాలంలో రెపోరేట్ హెచ్చు తగ్గులు తప్పక ఉంటాయని నో బ్రోకర్ సీఈవో అమిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. కొవిడ్కు ముందు 49 శాతం మంది మిలియనిల్స్ ఇండ్ల కొనుగోళ్లకు మొగ్గు చూపితే, ఇప్పుడు దాదాపు 63 శాతం మంది సొంతింటి కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారని మరో నో బ్రోకర్ సర్వేలో తేలింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో 2000 మంది వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించింది.