న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అదానీ గ్రూప్ సంపద 100 బిలియన్ డాలర్ల మేర తరిగిపోవడానికి కారణమైన అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్పై వస్తున్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ అండర్సన్ కొట్టివేశారు. హిండెన్బర్గ్పై నిషేధమేదీ లేదని, బ్యాంక్ ఖాతాల్ని స్తంభింపచేయలేదని, దానిపై ఎటువంటి దర్యాప్తూ జరగడం లేదని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ కార్పొరేట్ మోసాలపై జనవరి 24న నివేదికను ప్రచురించినప్పటి నుంచి సోషల్ మీడియాలో పలు వ్యాఖ్యానాలు వస్తున్నాయి.
అమెరికాలో హిండెన్బర్గ్పై మూడు క్రిమినల్ విచారణలు జరుగుతున్నాయని, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ రెగ్యులేటరీ అథారిటీ (ఎఫ్ఐఎన్ఆర్ఏ) నిషే ధం విధించిందని, న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టయిన కంపెనీలపై ఎటువంటి నివేదికనూ ప్రచురించకుండా నిషేధించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాల ఆధారంగా మీడియాలో వార్తలు సైతం వెలువడుతున్నాయి. ఈ వార్తలు అసత్యాలంటూ అండర్సన్ ట్వీట్ చేశారు. ఎఫ్ఐఎన్ఆర్ఏ తమను ఎప్పుడూ నిషేధించలేదని, తమ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయలేదని, ఎన్వైఎస్ఈ లిస్డెడ్ కంపెనీలపై నివేదికలు ప్రచురించరాదనడం ఒక విషయమే కాదని వివరించారు. అదానీ గ్రూప్పై నివేదిక వెలువడిన నెలన్నర ముందే ఎన్వైఎస్ఈ లిస్టెడ్ కంపెనీ వెల్టవర్పై 2022 డిసెంబర్ 7న హిండెన్బర్గ్ ఒక రిపోర్ట్ను ప్రచురించింది.