న్యూఢిల్లీ, అక్టోబర్ 24: దేశవ్యాప్తంగా లగ్జరీ కార్లు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. ఏడాదికి ఏడాదికి అమ్మకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కస్టమర్లు విలాసవంతమైన, అత్యధిక ఫీచర్స్ ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ లగ్జరీ కార్ల విక్రయాలు మాత్రం ఏటేటా పెరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ చివరినాటికి 33 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.
2022లో అమ్ముడైన 36 వేల స్థాయికి ఇంచుమించుకు చేరుకున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్ కూడా జతవనుండటంతో ఈ ఏడాది 43 వేల నుంచి 45 వేల యూనిట్లకు చేరుకోనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. ప్రధానంగా మెర్సిడెజ్ బెంజ్, ఆడీ, బీఎండబ్ల్యూ, జేఎల్ఆర్, వోల్వోలు లగ్జరీ కార్ల విక్రయ మార్కెట్లో ఉన్నాయి. 2018లో భారత్లో 41 వేలుగా ఉన్న లగ్జరీ కార్ల మార్కెట్ కరోనా దెబ్బకు కుదేలైంది. 2020 నాటికి ఇది 18 వేల నుంచి 19 వేలకు పడిపోయింది. ఆ తర్వాతి ఏడాది కూడా అంతంత మాత్రంగానే ఉండటం, 2022లో మాత్రం తిరిగి కోలుకున్నది. గడిచిన సంవత్సరంలో 36 వేల యూనిట్లు అమ్ముడయ్యాయి.
ద్రవ్యోల్బణం-వడ్డీరేట్ల సవాళ్లు
ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటం, అధిక వడ్డీరేట్లు దేశీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీరేట్లు మరింత పెరుగుతాయన్న అంచనా కొనుగోళుదారుల్లో నెలకొన్నది. దీంతో కార్లను కొనుగోలు ప్రక్రియను వాయిదావేస్తున్నట్టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. బుకింగ్ చేసుకున్న కారుకు కనీసంగా మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుండటం కూడా ఇందుకు కారణం.
మెర్సిడెజ్ బెంజ్..
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ జనవరి నుంచి సెప్టెంబర్ నాటికి తొమ్మిది నెలల్లోనే 12,768 యూనిట్లను విక్రయించింది. క్రితం ఏడాది అమ్ముడైన దాంతో పోలిస్తే 11 శాతం అధికమని పేర్కొంది. రికార్డు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోవడం కూడా ఇదే తొలిసారి.
బీఎండబ్ల్యూ..
మరో లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ 9,580 యూనిట్ల వాహనాలను విక్రయించింది. బీఎండబ్ల్యూ, మినీ బ్రాండ్లతో పలు మాడళ్ళను దేశీయంగా విక్రయిస్తున్నది.
ఆడీ..
గత తొమ్మిది నెలల్లో 5,530 యూనిట్లను విక్రయించింది ఆడీ. 2022 ఏడాది ఇదే సమయంలో అమ్ముడైన 1,343 యూనిట్లతో పోలిస్తే 88 శాతం అధికం.
వోల్వో కార్ ఇండియా..
స్వీడన్కు చెందిన కార్ల సంస్థ వోల్వో ఇండియా కూడా అమ్మకాల్లో 40 శాతం వృద్ధిని కనబరిచింది. జనవరి-సెప్టెంబర్ మధ్యకాలంలో సంస్థ 1,751 యూనిట్ల వాహనాలను విక్రయించింది.
జేఎల్ఆర్ ఇండియా..
జేఎల్ఆర్ ఇండియా రికార్డు స్థాయి పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో అమ్మకాలు 105 శాతం ఎగబాకి 2,356 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇది 1,308గా ఉన్నది.