న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ ఆశిస్తున్న ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) గట్టి షాక్ ఇచ్చేలా నిబంధనల్లో మార్పు చేసున్నదన్న వార్తలు తాజాగా వెలువడుతున్నాయి. నిర్దేశిత పరిమితికి మించిన జీతంపై పీఎఫ్ చెల్లించే ఈపీఎస్-95 సభ్యులకు అధిక పెన్షన్ను వర్తింపచేయాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి సంవత్సరంన్నర కావొస్తున్నా, ఈపీఎఫ్వో అనేక ఆప్షన్స్ను అప్పుడప్పుడూ ప్రకటిస్తూ తాత్సారం చేసింది.
అన్ని తతంగాల్ని పూర్తిచేసినట్టుగా ఈ జనవరి తొలినాళ్లలోనే సంస్థ సంకేతాలివ్వడంతో అధిక పెన్షన్ కల ఇక నెరవేరుతుందన్న తరుణంలో పెన్షన్ కాలిక్యులేషన్కు కొత్త విధానాన్ని తెస్తున్నట్లు వార్త. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్వో ఎటువంటి సర్క్యులర్నూ జారీచేయనప్పటికీ, వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాలకు కొత్త క్యాలిక్యులేషన్ విధానాన్ని తెలియపర్చినట్టు సమాచారం. తాజా రూల్ ప్రకారం ప్రొరాటా ప్రాతిపదికన పెన్షన్ ఎంత ఇవ్వాలన్నది నిర్ణయిస్తారు. దీంతో అధిక పెన్షన్కు అర్హులైనవారికి వచ్చే పెన్షన్ 30 శాతం నుంచి 40 శాతం వరకూ తగ్గుతుందని అంచనా.
సర్వీసు కాలం రెండు భాగాలుగా విభజన
వివిధ ప్రాంతాల్లోని కార్యలయాలకు ఈపీఎఫ్వో నుంచి వచ్చిన సమాచారం ప్రకారం అధిక పెన్షన్ కోరుకుంటున్న ఉద్యోగి సర్వీసు కాలాన్ని రెండు భాగాలుగా విభజిస్తారని ఎకనామిక్ లా ప్రాక్టీస్ సంస్థలోని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రాక్టీస్ హెడ్ పీవీ మూర్తి చెప్పారు. కొత్తగా విడుదల చేసినట్టు చెపుతున్న విధానం కింద వీరి సర్వీసు కాలాన్ని రెండు భాగాలుగా విభజించి, సగటు పెన్షన్బుల్ సేలరీని లెక్కిస్తారు. ఈపీఎస్-95 అమలులోకి వచ్చిన తేదీ 16.11.95 నుంచి 31.08.2014 వరకూ తొలిభాగంకాగా, 01.09.2014 నుంచి రిటైర్ అయ్యేంతవరకూ రెండో భాగంగా చూస్తారని మూర్తి వివరించారు.
ప్రధమ భాగంలోని చివరి 60 నెలల సగటు జీతాన్ని పెన్షన్ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు. ద్వితీయ భాగంలో చివరి 60 నెలల సగటు జీతం లేదా 01.09.2014 నుంచి పదవీ విరమణ చేసిన తేదీ (31.08.2019లోపు రిటైర్మెంట్)వరకూ సగటు నెల జీతాన్ని లెక్కలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ప్రొరాటాగా రెండు భాగాలుగా పెన్షన్ విభజించి చెల్లిస్తారు. అయితే ఈ ప్రొరాటా పెన్షన్ గణనను ఈపీఎఫ్వో అధికారికంగా ధృవీకరించలేదని, దానిని వివరించే సర్క్యులర్ ఏదీ జారీకాలేదని లా ప్రాక్టీసింగ్ సంస్థ కరంజవాలా అండ్ కో పార్టనర్ మన్మీత్ కౌర్ తెలిపారు.
ఎందుకు తగ్గుతుంది?
ప్రొరాటా ప్రాతిపదికన కొత్త క్యాలిక్యులేషన్ రూల్ ప్రకారం అర్హులైనవారికి వచ్చే పెన్షన్ గణనీయంగా తగ్గనుంది. ఎందుకంటే 2014 సెప్టెంబర్కు ముందుకాలంలో వేతనాలు ఇప్పటితో పోలిస్తే బాగా తక్కువ. అంటే తొలిభాగం 60 నెలల సగటు జీతానికి తగినట్టు అప్పటి పెన్షన్ను గణిస్తారు. మలిభాగం సగటుతో మరో పెన్షన్ను గణించి, రెండింటి సగటుతో తుది పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. దీంతో మొత్తంగా వచ్చే పెన్షన్ తగ్గిపోతుంది.
ఈపీఎఫ్వో ఇప్పటికే ప్రకటించిన విధానం ప్రకారం సర్వీసులో చివరి 60 రోజుల సగటు వేతనం ఆధారంగానే పెన్షన్ లెక్కింపు జరుగుతుంది. కానీ ఈపీఎఫ్వో కొత్త విధానాన్ని అవలంబిస్తే 30 శాతం నుంచి 40 శాతం తగ్గుతుందని, ఇది సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి విరుద్ధమని పీవీ మూర్తి చెప్పారు. ఈపీఎఫ్వో పెన్షన్ కాలిక్యులేషన్ రూల్ మార్చడం ద్వారా పెన్షన్ చెల్లింపు మొత్తాన్ని తగ్గించాలన్న లక్ష్యమే కన్పిస్తున్నదన్నారు. ఈ కొత్త మెథడాలజీని ఈపీఎఫ్వో నోటీఫై చేసినట్టయితే రిటైరీలు సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చని మన్మీత్ కౌర్ సూచించారు.