న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వరుసగా రెండు నెలలుగా తగ్గుముఖం పట్టిన టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో మళ్లీ ఎగబాకింది. తయారీ రంగ వస్తువులు భగ్గుమనడంతో గత నెలలో 11.39 శాతానికి ఎగబాకింది. ఇక ఆహార ధరలు తగ్గినా వరుసగా ఐదో నెలలోనూ రెండంకెల స్థాయిలో ఉండటం గమనార్హం. ఈ ఏడాది జూలైలో 11.16 శాతంగా ఉండగా.. నిరుడు జూలైలో 0.41 శాతంగా నమోదైంది. మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, సహజ వాయువు, తయారీ రంగ ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, టెక్స్టైల్స్, కెమికల్స్, కెమికల్స్ ఉత్పత్తులు మరింత అధికమయ్యాయని కేంద్ర వాణిజ్య, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు వరుసగా నాలుగో నెలలోనూ ఆహార పదార్థాల ధరల సూచీ మైనస్ 1.29 శాతంగా నమోదైంది. జూలైలో మాత్రం సున్న శాతంగా ఉన్నది. కానీ, ఉల్లి, పప్పు దినుసుల ధరల సూచీ మాత్రం స్వల్పంగా పెరిగింది.