Hero MotoCorp-Zero Motorcycle | దేశీయ టూ వీలర్స్ దిగ్గజం హీరో మోటో కార్ప్ త్వరలో ప్రీమియం సెగ్మెంట్లో బైక్ తీసుకు రానున్నది. అమెరికాలో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ జీరో మోటార్ సైకిల్స్ సంస్థతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంగతి హీరో మోటో కార్ప్ సోమవారం ప్రకటించింది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్, పవర్ ట్రైన్లలో అమెరికాలో లీడింగ్ సంస్థగా నిలిచింది జీరో మోటార్ సైకిల్స్. కాలిఫోర్నియా కేంద్రంగా పని చేస్తున్న జీరో మోటార్ సైకిల్స్తో రూ.580 కోట్ల (60 మిలియన్ డాలర్లు) విలువైన ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్కు గతేడాది సెప్టెంబర్లోనే హీరో మోటో కార్ప్ బోర్డు ఆమోదం తెలిపింది. ఎథేర్ ఎనర్జీ తర్వాత జీరో మోటార్ సైకిల్స్లో హీరో మోటో కార్ప్ భారీగా పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. `భవిష్యత్ మొబిలిటీ` విజన్లో భాగంగా దేశీయంగా వివిధ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ సంస్థలతో సహకార ఒప్పందాలతో దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ మార్కెట్లో వాటా పెంచుకోవాలని భావిస్తున్నది హీరో మోటో కార్ప్.
వాహనాల రంగంలో మెరుగైన టెక్నాలజీతో కూడిన బైక్స్, స్కూటర్లు తీసుకు రావడానికి జీరో మోటార్ సైకిల్స్లో మా ప్రయాణం ముఖ్యమైన మైలురాయి అని హీరోమోటో కార్ప్ చైర్మన్ అండ్ సీఈవో పవన్ ముంజాల్ తెలిపారు. జీరో మోటార్ సైకిల్స్ సీఈవో శామ్ పశ్చల్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు నూతన బైక్లను మార్కెట్లోకి తేవడానికి కృషి చేస్తాయన్నారు.
విదా వీ1 పేరుతో హీరో మోటో కార్ప్ దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నది. బెంగళూరు, ఢిల్లీ, జైపూర్లలో ప్రభుత్వ చార్జింగ్ మౌలిక వసతులను కల్పిస్తున్నది. ఈ మూడు నగరాల పరిధిలో దాదాపు 300 చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసింది.