Hero Moto Bikes Rates Rise | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ కస్టమర్లకు షాకిచ్చింది. ముచ్చటగా మూడోసారి బైక్లు, స్కూటర్ల ధరలు రూ.3000 వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. జూలై ఒకటో తేదీ నుంచి ధరల పెంపు నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ ఏడాదిలో బైక్స్, స్కూటర్లపై హీరో మోటో కార్ప్స్ ధరలు పెంచడం ఇది మూడోసారి.
ఇంతకుముందు జనవరిలో రూ.2000, ఏప్రిల్లో ధరలు పెంచేసింది. తాజాగా పెరుగనున్న బైక్స్, స్కూటర్ల ధరలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సవరిస్తున్నట్లు తెలిపింది. ఆయా మోడళ్ల బైక్స్, స్కూటర్లపై ఎంత మొత్తం ధర పెరుగుతుందన్నసంగతి వెల్లడించలేదు.
ముడి సరుకు ధరలతోపాటు ఓవరాల్గా బైక్స్, స్కూటర్ల తయారీ ఖర్చు పెరిగిందని హీరో మోటో కార్ప్స్ వెల్లడించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కస్టమర్లపై పాక్షికంగా భారం మోపక తప్పడం లేదని తెలిపింది. హెచ్ఎఫ్ డీలక్స్, ప్యాషన్ ప్రో వంటి ఎంట్రీ లెవెల్ మోటార్ బైక్స్, ఎక్స్ట్రీం 160 ఆర్, ఎక్స్ పల్స్ 200 ఏడీవీ వంటి స్పోర్టీ బైక్స్ను హీరో మోటో కార్ప్స్ అందిస్తున్నది.
మరోవైపు, హీరో మోటో కార్ప్స్ విపణిలో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆవిష్కరణ మరోమారు వాయిదా పడింది. హీరో మోటో కార్ప్స్ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్గా విదా ( Vida ) ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చిలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ను విపణిలోకి తేవాల్సింది. వచ్చే నెలలో ఆవిష్కరిస్తామని ప్రకటించినా.. వచ్చే పండుగల సీజన్లో విపణిలోకి తేనున్నది.