న్యూఢిల్లీ, ఆగస్టు 29: దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్.. తమ పాపులర్ కరిజ్మా బ్రాండ్ను మళ్లీ పరిచయం చేసింది. మంగళవారం ఎక్స్ఎంఆర్ మాడల్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్షోరూం ధర రూ.1.72 లక్షలుగా ఉన్నది. 6 స్పీడ్ ట్రాన్స్మిషన్తో వచ్చిన ఈ 210సీసీ బైక్లో లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉన్నట్టు సంస్థ పేర్కొన్నది. కాగా, ప్రీమియం సెగ్మెంట్లో హీరో విజయానికి కరిజ్మా ఎక్స్ఎంఆర్ చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా కంపెనీ సీఈవో నిరంజన్ గుప్తా వ్యక్తం చేశారు.
150సీసీలోపు ద్విచక్ర వాహన అమ్మకాల్లో దేశీయ మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న హీరో.. 150సీసీ-400సీసీ బైకులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ప్రీమియం సెగ్మెంట్లో వచ్చే ఏడాది కాలంలో ప్రతీ 3 నెలలకోసారి ఓ కొత్త బైక్ను మార్కెట్కు పరిచయం చేయనున్నట్టు నిరంజన్ గుప్తా తెలిపారు. ఏటా 20-25 శాతం వృద్ధిని చూస్తున్న భారతీయ ప్రీమియం బైక్ మార్కెట్లో హీరో వాటా 4-5 శాతంగానే ఉన్నది. దీంతో మార్కెట్ వాటాను పెంచుకోవడానికి వరుస నయా మోడల్స్ను రంగంలోకి దించనున్నట్టు గుప్తా విలేకరులకు చెప్పారు.
వచ్చే రెండేండ్లకుపైగా కాలంలో మరో 500 స్టోర్లను ఏర్పాటు చేసే దిశగా హీరో వెళ్తున్నది. అలాగే వచ్చే ఏడాదికిపైగా కాలంలో ఎక్స్క్లూజివ్ స్టోర్లనూ తేనున్నట్టు సంస్థ చెప్పింది. ప్రీమియం సెగ్మెంట్లో బలోపేతమే లక్ష్యంగా ఈ అడుగులు వేస్తున్నట్టు కంపెనీ సీఈవో గుప్తా తెలిపారు. ఈ ఏడాది జూలైలో హీరో మోటోకార్ప్.. స్థానికంగా తయారైన హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 బైక్ను మార్కెట్కు పరిచయం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో సొంత కంపెనీ బైక్లకూ ప్రీమియం సెగ్మెంట్లో ప్రాధాన్యత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.