ముంబై, ఏప్రిల్ 19: స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. చివరి అరగంటలో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు వరుసగా ఐదోరోజు మంగళవారం కూడా భారీగా నష్టపోయాయి. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు మధ్యాహ్నాం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలతో మదుపరులు ఒక్కసారిగా అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 703.59 పాయింట్లు లేదా 1.23 శాతం తగ్గి 57 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు 56,463.15 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 17 వేల దిగువకు జారుకున్నది. చివరకు 215 పాయింట్లు లేదా 1.25 శాతం తగ్గి 16,958.65 వద్ద స్థిరపడింది. గడిచిన ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,984.03 పాయింట్లు, నిఫ్టీ 825.70 పాయింట్ల మేర నష్టపోయాయి.
8 లక్షల కోట్లు మటాష్
మదుపరుల సంపద లక్షల కోట్లలో ఆవిరైపోతున్నది. స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల పాలవుతుండటంతో మదుపరులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడిచిన ఐదు ట్రేడింగ్లలో మదుపరులు ఏకంగా రూ.8 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల మార్కెట్ విలువ రూ.8,08,067.6 కోట్లు తగ్గి రూ.2,66,02,728.45 కోట్లకు పడిపోయింది. గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,984 పాయింట్లు నష్టపోయింది.