న్యూఢిల్లీ, జనవరి 11: కరోనా రోగులకు యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ కోసం వచ్చే క్లెయింలను ఆలస్యం చేయవద్దని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆదేశించింది. నిబంధనల ప్రకారం అలాంటి క్లెయింలను సత్వరమే పరిష్కరించడానికి ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించింది. యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ వంటి ప్రయోగాత్మక చికిత్సల క్లెయింలను బీమా సంస్థలు తిరస్కరిస్తున్నాయన్న దానిపై ఐఆర్డీఏఐ ఇలా స్పందించింది. ‘కరోనా రోగులకు యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ చికిత్స కోసం వస్తున్న క్లెయింలను తిరస్కరించడమో లేదా ఖర్చులను తగ్గించి ఇవ్వడమో జరుగుతున్నది. ఇది సరికాదు. ఈ క్లెయింలనూ వెంటనే పరిష్కరించాలి’ అని జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల సీఈవోలు, ఎండీలకు ఇచ్చిన సర్క్యులర్లో ఐఆర్డీఏఐ స్పష్టం చేసింది. యాంటిబాడీ కాక్టెయిల్ థెరపీ అత్యవసర వినియోగానికి గతేడాది మే నెలలో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి ఇందుకు సంబంధించిన క్లెయింలను బీమా సంస్థలు తిప్పి పంపరాదని ఐఆర్డీఏఐ తేల్చి చెప్పింది.