హైదరాబాద్, అక్టోబర్ 6: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ హెచ్డీఎఫ్సీ..రాష్ట్రంలో తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో 314 శాఖలు ఉండగా..వచ్చే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మరో 90 శాఖలను ప్రారంభించబోతున్నట్లు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ చౌదరీ తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 274 శాఖలు ఉండగా, కొత్తగా 89 ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. శాఖల ఏర్పాటుతో కొత్తగా 5 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు, ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఆరంభమైందని వ్యాపారుల కోసం రూపొందించిన సరికొత్త యాప్ విడుదల కార్యక్రమంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
వ్యాపారులకోసం ప్రత్యేక యాప్
వ్యాపారుల లావాదేవీలు, రుణాల తిరిగి చెల్లింపులను మరింత సరళతరం చేసే ఉద్దేశంలో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సరికొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్మార్ట్ హబ్ వ్యాపార్’ పేరు కలిగిన ఈ యాప్తో అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు పొందవచ్చునని బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టీవీఎస్ రావు తెలిపారు. జూలైలో ఆరంభమైన ఈ యాప్ సేవలు ఇప్పటి వరకు 10 లక్షల మంది రిజిస్టార్ అయ్యారని, వీరిలో తెలంగాణ నుంచి లక్ష మంది ఉన్నట్లు చెప్పారు. వీరి నుంచి ఎలాంటి చార్జి వసూలు చేయలేదని, పూర్తిగా ఇది ఉచితమన్నారు.