ముంబై, అక్టోబర్ 16: దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,811 కోట్ల నికర లాభాన్ని గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.11,162 కోట్ల లాభంతో పోలిస్తే భారీగా పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ విలీనమైన తర్వాత విడుదల తొలి ఆర్థిక ఫలితాలు ఇవే కావడం విశేషం. ఏడాది క్రితం రూ.46,181 కోట్లుగా ఉన్న బ్యాంక్ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.78,406 కోట్లకు చేరుకున్నట్టు బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది.